
తాడేపల్లి: వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో మైనార్టీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీడీపీలు తీరని ద్రోహం చేశాయని మండిపడ్డారు వైఎస్సార్ సీపీ నేత, మాజీ మంత్రి శైలజానాథ్. వక్ఫ్ బిల్లు అంశాన్ని పక్కదోవ పట్టించేందుకు పీసీసీ అధ్యక్షురాలిగా ఉన్న వైఎస్ షర్మిలతో ాట్లాడిస్తున్నారన్నారు. ఒక అంశాన్ని డైవర్ట్ చేయడానికి మరొక అంశాన్ని పైకి తేవడం చంద్రబాబుకి అలవాటని ధ్వజమెత్తారు. చంద్రబాబు రాజకీయాల్లో ఎప్పుడు కష్టాల్లో ఉన్నా, డైవర్షన్ చేయడానికి షర్మిలను ఉపయోగించుకుంటున్నారన్నారు. వైఎస్ జగన్ లక్ష్యంగా చంద్రబాబు చేస్తున్న రాజకీయాల్లో ఆమె ఒక భాగంగా మారారన్నారు.
‘ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా, వారికిచ్చిన మాట తప్పుతూ వక్ఫ్ బిల్లు విషయంలో మైనార్టీలకు చంద్రబాబునాయుడుగారు ద్రోహం చేశారు. ఇప్పుడు వారికి సమాధానం చెప్పలేక టీడీపీ పార్టీ నానా ఇబ్బందులు పడుతున్న సమయంలో డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా షర్మిలను రంగంలోకి దిగారని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. విజయవాడ వరదలు అంశం అయినా, తిరుపతి లడ్డూ విషయం అయినా, ఇప్పుడు వక్ఫ్ బిల్లు విషయం అయినా ఇలా చంద్రబాబుగారి ప్రభుత్వం ఎప్పుడు ఇబ్బందుల్లో ఉన్నా డైవర్ట్ చేయడానికి షర్మిళగారు రావడం, ప్రెస్మీట్లు పెట్టడం అన్నది ఒక రివాజుగా మారింది.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా షర్మిల ప్రభుత్వంలో ఉన్నవారిని నిలదీయాలి, ప్రజల తరఫున ప్రజా సమస్యలపై వారిని ప్రశ్నించాలి. కాని దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతిపక్షంలో ఉన్నవారిని నిలదీస్తూ ఒక ప్రతిపక్షానికి చెందిన రాష్ట్రశాఖ అధ్యక్షురాలైన షర్మిల రాజకీయాలు చేస్తున్నట్లుంది. రాజకీయాల్లో ఇది వింతగా ఉంది. చంద్రబాబు ఎప్పుడు డైవర్షన్ కావాలనుకుంటే అప్పుడు ఆమె రంగంలోకి దించుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఆమె ఏం చేస్తున్నారన్నదానిపైనే ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.మరి ఆమె చేస్తున్న రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ కోసమా? లేక చంద్రబాబుకోసమా?
గత ఎన్నికల్లో ఎన్డీయేను గెలిపించడమే లక్ష్యంగా పనిచేశారు. వారికి సంబంధించిన మాధ్యమాల్లో వారు చెప్పినట్టుగానే మాట్లాడారు. ఆమేరకే నడుచుకున్నారు. ఇక్కడే షర్మిల అసలు ఉద్దేశాలు బయటపడ్డాయి’ అని శైలజానాథ్ ధ్వజమెత్తారు.