లోకేష్ కోసమే బాబు దావోస్‌ పర్యటన: దేవినేని అవినాష్‌ | YSRCP Devineni Avinash Serious Comments On CBN And Nara Lokesh | Sakshi
Sakshi News home page

లోకేష్ కోసమే బాబు దావోస్‌ పర్యటన: దేవినేని అవినాష్‌

Jan 24 2025 1:02 PM | Updated on Jan 24 2025 1:11 PM

YSRCP Devineni Avinash Serious Comments On CBN And Nara Lokesh

సాక్షి, విజయవాడ: మంత్రి నారా లోకేష్‌ను ప్రమోట్‌ చేయడానికే చంద్రబాబు దావోస్‌ వెళ్లారని ఆరోపించారు వైఎస్సార్‌సీపీ నాయకులు దేవినేని అవినాష​్‌. లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలన్న ఆకాంక్షతో ప్రచారం చేస్తున్నారు. ప్రజాధనంతో దావోస్‌లో ఎంజాయ్ చేస్తాం అంటే చూస్తూ ఊరుకోము అంటూ హెచ్చరించారు.

తూర్పు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీలో 29 అనుబంధ సంఘాలకు అధ్యక్షులు నియామకం జరిగింది. అధ్యక్షులుగా నియమితులైన వారిని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ అభినందించారు. ఈ క్రమంలో చంద్రబాబు , లోకేష్ దావోస్ పర్యటనపై దేవినేని అవినాష్ స్పందించారు. ఈ సందర్బంగా అవినాష్‌ మాట్లాడుతూ..‘చంద్రబాబు ఆయన కొడుకు 100 కోట్ల ప్రజాధనంతో దావోస్ పర్యటనకు వెళ్లారు. రూపాయి పెట్టుబడి తీసుకురాలేని దావోస్ పర్యటన వల్ల ఈ రాష్ట్రానికి ఒరిగిందేమిటి?. నారా లోకేష్‌ను ప్రమోట్ చేయడానికే చంద్రబాబు దావోస్ వెళ్లాడు. లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలన్న ఆకాంక్షతో ప్రచారం చేస్తున్నారు.

దావోస్ పర్యటన వల్ల ఏయే పెట్టుబడులు వచ్చాయో ప్రజలకు చెప్పాలి. మహారాష్ట్ర, తెలంగాణ వేల కోట్ల ఒప్పందాలు చేసుకున్నాయి. కానీ, ఆంధ్రప్రదేశ్ ఎటువంటి ఒప్పందాలు చేసుకోలేదు. చంద్రబాబు ఐదు సార్లు దావోస్ వెళ్లినా.. వైఎస్‌ జగన్ ఒక్కసారి వెళ్లిన పర్యటనతో సమానం.  వైఎస్‌ జగన్‌ దావోస్ పర్యటనలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు తెచ్చారు. రాష్ట్రాన్ని వైఎస్‌ జగన్ అన్ని విధాలా అభివృద్ధి చేశారని మేం గర్వంగా చెప్పగలం. చంద్రబాబు, లోకేష్‌కి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర అభివృద్ధికి పెట్టుబడులు తేవాలి. ప్రజాధనంతో ఎంజాయ్ చేస్తాం అంటే చూస్తూ ఊరుకోం. 

ప్రజల్లోకి వెళ్తే పథకాలు గురించి నిలదీస్తారని వెళ్లడమే మానేశారు. సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన మధ్య వార్ జరుగుతోంది. తూర్పు బైపాస్‌పై ప్రకటనలు ఇచ్చిన కూటమి నేతలు ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేశారు. కూటమి నేతలు ఎందుకని ఇక్కడి ప్రజల మీద కక్ష కట్టారు. చంద్రబాబు, లోకేష్‌, పవన్ కళ్యాణ్‌, బెజవాడ ఎంపీ కలిసి కేంద్ర పెద్దలతో మాట్లాడి తూర్పు బైపాస్‌కి ఒప్పించాలి. కూటమి నేతలు ప్రతీ పనిలో కలెక్షన్లు వెతుక్కుంటున్నారు.  కమీషన్‌, కరప్షన్ ఎజెండాతో ముందుకు వెళ్తున్నారు. తూర్పు నియోజకవర్గంలో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. జగ్గయ్యపేటలో దొరికిన గంజాయిపై కూటమి నేతలు మాట్లాడాలి. గంజాయి నిర్మూలన చేస్తామని చెప్పిన నేతలు ఇప్పుడు గంజాయి ఎక్కడి నుంచి వస్తుందో తేల్చాలి. చంద్రబాబు హయంలో కాలనాగులు మళ్లీ పడగ విప్పుతున్నారు. పేద వారిని దోచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. పేదల పక్షాన వైఎస్సార్‌సీపీ నిలబడుతుంది’ అని కామెంట్స్‌ ఇచ్చారు. 

Advertisement
 
Advertisement
Advertisement