
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కూటమి ప్రభుత్వంపై ఇష్టానుసారం వ్యవహరిస్తోంది. వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేసి.. బెదిరింపులకు దిగుతోంది. జీవీఎంపీ మేయర్ వెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానంలో భాగంగా కార్పొరేటర్లతో అనుచితంగా ప్రవర్తించింది. ఈ నేపథ్యంలో రాజకీయమంటే వ్యాపారం కాదని వైఎస్సార్సీపీ కార్పొరేటర్ శశికళ.. చంద్రబాబు సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
జీవీఎంసీ వైఎస్సార్సీపీ కార్పొరేటర్ శశికళ తాజాగా మాట్లాడుతూ..‘ప్రత్యేక విమానంలో కేరళ వచ్చి కూటమి నేతలు నన్ను బెదిరించారు. కూటమికి అనుకూలంగా ఓటు వేయమన్నారు. నేను పార్టీ మారేది లేదని చెప్పాను. మొదటి నుంచి నేను వైఎస్సార్సీపీలోనే ఉన్నాను. రాజకీయమంటే వ్యాపారం కాదు.. డబ్బుల కోసం నీతిమాలిన రాజకీయాలు చేయను. నీచమైన రాజకీయాలను చేయవద్దని చెప్పాను. వైఎస్ జగన్ వల్లే నేను కార్పొరేటర్ అయ్యాను అని చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉండగా.. అధికార దాహంతో.. గత 11 నెలల పదవి కాలంలో కూటమి ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసింది. ఈ క్రమంలో ఇప్పుడు విశాఖ మేయర్పై అవిశ్వాసం వేళ (GVMC No Confidence Motion) మరోసారి భారీగా ప్రలోభాలకు తెరలేపింది. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ కార్పొరేటర్లకు గాలం వేసేందుకు కోట్లాది రూపాయలను మంచి నీళ్లలా ఖర్చు చేస్తోంది.
అవిశ్వాసానికి సమయం దగ్గర పడుతుండడంతో కూటమి నేతలు ప్రలోభాల ఉధృతిని పెంచారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల ఇళ్లకు వెళ్లి వాళ్ల కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. భారీగా డబ్బు ఇస్తామని, భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా చూస్తామని హామీలు గుప్పిస్తున్నారు. అలాగే.. శ్రీలంక, కేరళ నుంచి విశాఖకు తీసుకురావడానికి ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తామంటున్నారు. విమానం కాకపోతే హెలికాప్టర్స్ అయినా ఏర్పాటు చేస్తామంటూ ఆఫర్లు చేస్తున్నారు. అయితే.. తాము వైఎస్సార్ అభిమానులమని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా వైఎస్ జగన్(YS Jagan)తోనే ఉంటామని చెబుతూ కార్పొరేటర్లు ఆ ఆఫర్లను తిరస్కరిస్తున్నారు. ఈ క్రమంలో బెదిరింపులకు సైతం కొందరు లొంగడం లేదని సమాచారం.

జీవీఎంసీ(GVMC) ఎన్నికల్లో 58 స్థానాలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుని మేయర్ పదవిని చేజిక్కించుకుందని, 30 స్థానాలు మాత్రమే గెలుచుకున్న టీడీపీ ఇప్పుడు మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలనే దురాలోచనతో ఉంది. ఈ క్రమంలోనే భారీగా డబ్బు ఆశ చూపించడం, బెదిరింపులలాంటి అప్రజాస్వామిక ప్రయత్నాలకు దిగింది.