వాళ్లు అన్నదాంట్లో తప్పేముంది!: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

Venkaiah Naidu Said Give Up Colonial Mindset Pride Indian Identity - Sakshi

సాక్షి ఉత్తరాఖండ్‌(హరిద్వార్‌): హరిద్వార్‌లోని దేవ్ సంస్కృతి విశ్వ విద్యాలయంలో సౌత్ ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పీస్ అండ్ రీకన్సిలియేషన్‌ను భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగంలో మాట్లాడుతూ దేశంలోని ప్రజలు తమ ‘వలసవాద మనస్తత్వాన్ని’ విడిచిపెట్టి, తాము భారతీయులం అని గర్వపడటం నేర్చుకోవాలని కోరారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతుందని ఇక లార్డ్ మెకాలే విద్యా విధానాన్ని పూర్తిగా స్వస్తి పలకాలని పిలుపు నిచ్చారు.

‘దేశంలో విద్యా మాధ్యమంగా.. విదేశీ భాషను విధించి ఉన్నత వర్గాలకే విద్యను పరిమితం చేశారని ఆరోపించారు. ఆ విద్యా విధానం మనల్ని మనం తక్కువ జాతిగా చూసుకోవడం నేర్పింది. మన స్వంత సంస్కృతిని, సంప్రదాయ వివేకాన్ని తృణీకరించేలా చేసింది. దేశీయంగా కూడా మన ఎదుగుదలను మందగించేలా చేసింది. ఈ విద్యా విధానానికి సంబంధించిన విద్యను కొంతమందికే పరిమితం చేసింది. దీని వల్ల అధిక జనాభా విద్యాహక్కును కోల్పోతోంది’ అని అన్నారు. మన వారసత్వం, మన సంస్కృతి, మన పూర్వీకుల గురించి మనం గర్వపడటమే కాక మనం మన మూలాల్లోకి తిరిగి వెళ్లాలన్నారు.

మనం అనేక భారతీయ భాషలను నేర్చుకోవడమే కాక మాతృభాషను ప్రేమించాలని తెలిపారు. జ్ఞాననిధి అయిన మన గ్రంధాలను తెలుసుకోవాలంటే సంస్కృతం నేర్చుకోవాలని చెప్పారు. అన్ని గ్యాడ్జెట్ నోటిఫికేషన్‌లు సంబంధిత రాష్ట్ర మాతృభాషలో విడుదలయ్యే రోజుకోసం తాను ఎదురుచూస్తున్నానని అన్నారు. మీ మాతృభాష మీ కంటి చూపు లాంటిదని విదేశీ భాషపై ఉన్న జ్ఞానం మీ కళ్లద్దాలు లాగా ఉండాలని అభివర్ణించారు. భారతదేశ నూతన విద్యా విధానానికి భారతీయకరణ ప్రధానమైనదని మాతృభాషల ప్రోత్సాహానికీ అధిక ప్రాధాన్యతనిస్తుందని వెంకయ్యనాయుడు అన్నారు. 

అయితే గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం 2022-23 విద్యా సంవత్సరం నుంచి 6వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులకు పాఠశాల సిలబస్‌లో భాగంగా భగవద్గీతను ప్రవేశపెడతామని కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రతిపక్షాలు విద్యను కాషాయికరణం చేస్తున్నారంటూ విరుచుకుపడ్డాయి. దీంతో వెంక్యనాయుడు బీజేపీ అన్నదాంట్లో తప్పేముందంటూ గట్టి కౌంటరిచ్చారు. మన ప్రాచీన గ్రంథాలలో ఉన్న తత్వాలైన సర్వే భవంతు సుఖినాః (అందరూ సంతోషంగా ఉండండి) , వసుధైవ్ కుటుంబకం (ప్రపంచం ఒకే కుటుంబం) వంటివి నేటికీ మన విదేశాంగ విధానానికి మార్గదర్శకాలు అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నొక్కి చెప్పారు.

(చదవండి: అమిత్‌ షాతో భేటీ పచ్చి అబద్ధం.. బీజేపీలో చేరేదే లే!)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top