మంత్రి కేటీఆర్‌కు పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి సవాల్‌ | TPCC chief Revanth Reddy challenges to Minister KTR | Sakshi
Sakshi News home page

మంత్రి కేటీఆర్‌కు పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి సవాల్‌

Jan 28 2023 4:41 AM | Updated on Jan 28 2023 2:57 PM

TPCC chief Revanth Reddy challenges to Minister KTR - Sakshi

కోస్గిలో మాట్లాడుతున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి 

దౌల్తాబాద్‌: ఇందిరమ్మ ఇళ్లు లేని గ్రామాల్లో తాము ఓట్లు అడగమని, మరి డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇవ్వని గ్రామాల్లో మీరు ఓటు అడగకుండా ఉంటారా అని మంత్రి కేటీఆర్‌కు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు. హాథ్‌సేహాథ్‌ జోడో కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ నియోజక వర్గం పరిధిలోని దౌల్తాబాద్‌లో ఆయన మాట్లాడా రు. కాంగ్రెస్‌ హయాంలో ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించామని, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇస్తామని చెప్పి మోసం చేస్తోందని నిందించారు.  దేశాన్ని ఏకతాటి పైకి చ్చేందుకే రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర చేపట్టారని, రాహుల్‌ సందేశాన్ని ప్రతి ఇంటికి చేర్చేందుకు హాథ్‌సేహాథ్‌ జోడో కార్యక్రమాన్ని చేపడుతున్నా మని రేవంత్‌ చెప్పారు. ‘మీరు కష్టపడి నాటిన మొక్క నేడు ఒక వృక్షమై కొడంగల్‌కు గుర్తింపు తీసుకొచ్చింది వాస్తవం కాదా..  119 నియోజక వర్గాల బీఫాంలపై సంతకం పెట్టే అవకాశం నాకు కల్పించారు’ అంటూ  భావోద్వేగానికి గురయ్యారు.

గురునాథ్‌రెడ్డిని కలిసిన రేవంత్‌
కొడంగల్‌: బీఆర్‌ఎస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డిని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువా కప్పి సత్కరించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆదేశాల మేరకు గురునాథ్‌రెడ్డిని కలిసినట్లు రేవంత్‌ తెలిపారు. గురునాథ్‌రెడ్డి గతంలో కాంగ్రెస్‌ పార్టీలో ప్రముఖ నాయకుడని, కొడంగల్‌ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని గుర్తు చేశారు.

కొడంగల్‌కు కేటీఆర్‌ చేసిందేమీలేదు: రేవంత్‌
కోస్గి/మద్దూరు:మంత్రి కేటీఆర్‌ కొడంగల్‌ను దత్తత తీసుకొని కొత్తగా చేసిన అభివృద్ధి ఏమీ లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉండి తాను చేసిన అభివృద్ధికి, ప్రస్తుతం అధికారంలో ఉండి మీరు చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని సవాల్‌ విసిరారు. హాథ్‌ సే హాథ్‌  జోడో యాత్రలో భాగంగా చేపట్టిన సన్నాహక యాత్ర శుక్రవారం రాత్రి నారాయణపేట జిల్లా కోస్గికి చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక శివాజీ చౌరస్తాలో నిర్వహించిన రోడ్‌షోలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. 

Advertisement
 
Advertisement
Advertisement