ఆదివారం మహాధర్నాలో మాట్లాడుతున్న పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్. చిత్రంలో మధుయాష్కీ, వీహెచ్, వివేక్, మల్రెడ్డి రంగారెడ్డి తదితరులు
ఇందిరాపార్కు వద్ద మహాధర్నాలో టీపీసీసీ చీఫ్ మహేశ్గౌడ్
బాధ్యత గల ప్రతిపక్ష నేత పదవిని అపహాస్యం చేయొద్దు
జీతం తీసుకుంటూ ఫామ్హౌస్కు పరిమితం కావొద్దు
అధికారం శాశ్వతం కాదు.. అది ప్రజలిచ్చే కానుక
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ జీతం తీసుకుంటూ ఫామ్హౌస్కు పరిమితమైన బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్రావు వెంటనే తన ప్రధాన ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేశ్కుమార్గౌడ్ డిమాండ్ చేశారు. అధికారం, ప్రభుత్వాలు, పదవులు శాశ్వతం కాదని, ప్రజాస్వామ్యంలో ప్రధాన ప్రతిపక్ష నేతకు చాలా గౌరవం ఉంటుందని, అలాంటి పదవిని అపహాస్యం చేయవద్దని హితవు పలికారు. అసెంబ్లీకి రాని కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం టీపీసీసీ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖ సలహాదారు, మాజీ ఎంపీ వి. హనుమంతరావు అధ్యక్షతన జరిగిన ఈ ధర్నా కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజహరుద్దీన్, దుద్దిళ్ల శ్రీధర్బాబు, వివేక్లతో పాటు ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్కుమార్రెడ్డి, అనిల్ కుమార్యాదవ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు జగ్గారెడ్డి అంజన్కుమార్ యాదవ్, పలువురు డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
మళ్లీ కాంగ్రెస్దే అధికారం..
ఈ సందర్భంగా మహేశ్గౌడ్ మాట్లాడుతూ.. ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమం కేసీఆర్కు కనపడడం లేదా అని ప్రశ్నించారు. ‘మేం తప్పు చేస్తే ప్రతిపక్షాలు ఎత్తి చూపొచ్చు. కానీ అసత్యాలు ప్రచారం చేయడం సబబు కాదు. తప్పిదాలు జరిగితే సరిదిద్దుకుంటాం..’ అని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమం అమలు జరుగుతున్నాయని, మళ్లీ కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అధికారం ప్రజలు ఇచ్చే కానుక అని, దాన్ని మేం సది్వనియోగం చేసుకుంటుంటే, ప్రజలిచ్చిన అవకాశాన్ని ప్రతిపక్ష పార్టీలు దుర్వినియోగం చేసుకుంటున్నాయన్నారు. మంత్రి అజహరుద్దీన్, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ మాట్లాడుతూ.. కేసీఆర్ తెలంగాణ ప్రజల సొమ్ము తింటూ ఫామ్హౌస్లో పడుకుంటున్నాడని విమర్శించారు. అసెంబ్లీకి వస్తావా, రాజీనామా చేస్తావా అని ప్రశ్నించారు. ఒకవేళ కేసీఆర్ రాజీనామా చేయకపోతే స్పీకర్ తగిన చర్యలు తీసుకుని ఆయన శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.


