అక్కడ టీఆర్‌ఎస్‌ దూకుడు.. బీజేపీ ప్లాన్‌ ఏంటి?

Three Cornered Contest In Musheerabad Constituency - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముషీరాబాద్ నుంచి బరిలో దిగేందుకు అన్ని పార్టీల్లోనూ పోటీ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ముక్కోణపు పోటీయే జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో కూడా మూడు ప్రధాన పార్టీల మధ్యే పోటీ ఉంటుంది. గత ఎన్నికల్లో ముషీరాబాద్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్ విజయం సాధించారు. బీజేపీ నుంచి పోటీ చేసిన డాక్టర్‌ కే.లక్ష్మణ్ మూడో స్థానానికి పరిమితం అయ్యారు.
చదవండి: ‘గులాబీ’ పార్టీలో కలవరం అందుకేనా?.. అసలు అక్కడ ఏం జరుగుతోంది?

ముషీరాబాద్ నియోజకవర్గంలో యాదవ సామాజిక వర్గం ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఈ వర్గం ఏ పార్టీవైపు మొగ్గితే.. ఆ పార్టీ అభ్యర్థి విజయం సాధించే అవకాశాలుంటాయి. ముందస్తు ఎన్నికల ప్రచారంతో మూడు పార్టీల ఆశావహులు తమ బలాన్ని పెంచుకునేందుకు వ్యూహ రచన చేస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ మళ్ళీ పోటీ చేసే వీలుంది.

మరోనేత సంగిశెట్టి జగదీష్ కూడా టిక్కెట్ ఆశిస్తున్నారు. బీజేపీ తరపున గత ఎన్నికల్లో పోటీ చేసిన కే.లక్ష్మణ్ ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. దీంతో బీజేపీ కొత్త అభ్యర్థిని బరిలో దింపనుంది. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కొడుకు విక్రమ్ గౌడ్ బీజేపీ టిక్కెట్ ఆశిస్తున్నారు. రాజాసింగ్‌ను కాదని గోషామహాల్‌ను విక్రమ్ గౌడ్‌కు ఇవ్వలేరు కాబట్టి ఆయనకు ముషీరాబాద్ టిక్కెట్ ఇస్తామంటుంన్నారట బీజేపీ పెద్దలు. వీరితో పాటు ఇద్దరు కార్పొరేటర్లు, ఓ పారిశ్రామిక వేత్త టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు.

సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఎలాగైనా గెలిచేందుకు ప్రధాన పార్టీలన్నీ కసరత్తు చేస్తున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తుంటే.. బీజేపీ, కాంగ్రెస్లు తామే గెలవాలని ప్రయత్నిస్తున్నాయి. గత ఎన్నికల్లో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కాంగ్రెస్ అభ్యర్ధి కాసాని జ్ఞానేశ్వర్‌పై గెలిచారు. సికింద్రాబాద్ పరిధిలో ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు ఎక్కువ ఉంటారు. వీరితో పాటు క్రిస్టియన్ మైనారిటీ ఓట్లు గెలుపు ఓటములను ప్రభావితం చేస్తాయి. బీజేపీ నుంచి మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి సికింద్రాబాద్‌ నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరే క్రమంలో సికింద్రాబాద్ టిక్కెట్ ఇస్తామని కార్తీకరెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ నుంచి ఆదం సంతోష్, కాసాని జ్ఞానేశ్వర్, సంగిశెట్టి జగదీష్‌లు సికింద్రాబాద్ టిక్కెట్ ఆశిస్తున్నారు.

సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల కోసం నేతలు గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు. ఇక్కడి నుండి ఐదు సార్లు గెలుపొందిన సాయన్న మరోసారి గెలిచేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఇతర పార్టీల కంటే సొంత పార్టీలోనే పోటీ ఎక్కువ ఉండడంతో ఈ సారి సాయన్న మరింత కష్టపడాల్సి ఉంది. కార్పొరేషన్ చైర్మన్ లు  గజ్జల నగేష్, క్రిశాంక్ లు సైతం కంటోన్మెంట్ టిక్కెట్ ఆశిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ మళ్ళీ టిక్కెట్ అడిగే అవకాశం ఉంది. అయితే బొల్లు కిషన్ ఈసారి కాంగ్రెస్ టిక్కెట్ తనకే అంటూ ప్రచారం చేసుకుంటుంన్నారు. టీ కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఛైర్మన్ ప్రీతం నగరికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇప్పటికే ఇక్కడ పని చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

బీజెపి విషయానికొస్తే కంటోన్మెంట్లో బలమైన నాయకులు ఎవరు కనిపించడం లేదు. ఇతర నియోజకవర్గాల నేతలు ఇద్దరు ఇక్కడ గ్రౌండ్‌వర్క్‌ ప్రారంభించారు. కంటోన్మెంట్ బోర్డుకు చెందిన ఓ అధికారి సైతం బీజేపీ నుంచి అవకాశం వస్తే ఉద్యోగానికి రాజీనామా చేసి బరిలో దిగాలన్న ఆలోచనలో ఉన్నారట.

పారిశ్రామిక నియోజకవర్గం సనత్‌నగర్ నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు తీవ్రంగానే పోటీ పడుతున్నాయి. గత ఎన్నికల్లో మహా కూటమిలో భాగంగా కాంగ్రెస్ ఈ సీటును టీడీపీకి కేటాయించింది. టీఆర్ఎస్ నుంచి మళ్లీ తలసాని బరిలోకి దిగడానికి ఎక్కువ ఛాన్స్ఉంది. బీజేపీ నుంచి శ్యాంసుందర్ గౌడ్ పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

సినీ నటి విజయశాంతి కూడా బీజేపీ తరపున ఇక్కడ నుంచే పోటీ చేయాలనుకుంటున్నట్లు తెలుస్తుంది. బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మిని బరిలో దింపితే ఎలా ఉంటుందనే ఆలోచనతో బీజేపీ నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే మర్రి శశిథర్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో కూటమిలో భాగంగా టీడీపీకి టిక్కెట్ కేటాయించడంతో మర్రి శశిథర్ రెడ్డి పోటీ చేయలేదు. ఈసారి తనకు గాని తన చిన్న కొడుకుకు గాని టిక్కెట్ ఇవ్వాలని శశిథర్ రెడ్డి కోరుతున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ అంతా సెలబ్రిటీలే నివసిస్తుండటం దీని ప్రత్యేకత. వెండి వెలుగుల రంగుల ప్రపంచం ఫిలిం నగర్కూడా ఈ నియోజకవర్గంలోనే ఉంది. రాజకీయ పార్టీలన్నీ ఇక్కడ విజయం సాధించడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటాయి. ఇక్కడ గెలిస్తే సినిమా ఇండస్ట్రీ కొంతమేర పార్టీకి అనుకూలంగా ఉంటుందని ఆయా రాజకీయ పార్టీలు భావిస్తాయి. దీంతో జూబ్లీహిల్స్ లో ఎలాగైనా గెలిచేందుకు అన్ని రకాల ప్రయోగాలు చేస్తుంటాయి ప్రధాన పార్టీలు. అయితే ఈ నియోజకవర్గంలో సెటిలర్స్ తో పాటు మైనారిటీ ఓట్లే అభ్యర్థి గెలుపును శాసిస్తాయి. దీంతో ఈ రెండు వర్గాలకు దగ్గరగా ఉన్న నేతలను బరిలో దింపేందుకు అన్ని పార్టీలు కసరత్తు ప్రారంభించాయి.

గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ నేత మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు. 2014లో టీడీపీ నుంచి గెలిచిన గోపీనాథ్ ఆ తర్వాత టిఆర్ఎస్‌లో చేరారు. వచ్చే ఎన్నికల్లో కూడా గోపీనాథ్‌కే టిఆర్ఎస్ టిక్కెట్ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.  మైనారిటీలతో పాటు సెటిలర్స్ లో మాగంటికి గుర్తింపు ఉంది. అదేవిధంగా టీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యం మాగంటి గోపినాథ్‌కు కలసివచ్చే అంశం. జూబిలీ హిల్స్‌లో కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే పీజేఆర్ కొడుకు విష్ణువర్థన్‌ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది.

గత రెండు సార్లు వరుసగా ఓడిన విష్ణు ఈసారి తానే గెలుస్తానని ధీమాగా ఉన్నారు. పీజేఆర్ అభిమానులు, మైనారిటీ వర్గం తనకే మద్దతు ఇస్తుందని విష్ణు నమ్ముతున్నారు. మరోవైపు బీజేపీ ఇక్కడ గెలవడం కోసం కసరత్తు ప్రారంబించింది. సరైన అభ్యర్థి కోసం వేట మొదలుపెట్టింది. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన రావుల శ్రీధర్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరడంతో ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు లంకల దీపక్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఎంఐఎం నుంచి నవీన్ యాదవ్ పోటీ చేస్తారని సమాచారం. సిటింగ్స్‌ను కాపాడుకునేందుకు టీఆర్ఎస్, ఎలాగైనా తమ స్థానాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్, ఏం చేసైనా పాగా వేయాలని బీజేపీ, అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఎంఐఎం ఇలా జూబ్లీహిల్స్ లో ఎవరి వ్యూహాలు వారు రచిస్తున్నారు. 
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top