రాజ్యాంగ స్ఫూర్తి మేరకే పంచాయతీలకు నిధులు
కేసీఆర్ చిల్లర వ్యవహారమనడం దురదృష్టకరం
బండి సంజయ్ వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులి వ్వడాన్ని సీఎం కేసీఆర్ చిల్ల ర వ్యవహారంగా తప్పుపట్టడం అత్యంత దురదృష్టకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. నిధులు, విధులను నేరుగా పం చాయతీలకు బదలాయించాలన్నదే 73వ రాజ్యాంగ సవరణ ముఖ్య ఉద్దేశమని, రాజ్యాంగ స్ఫూర్తి మేరకే మోదీ ప్రభుత్వం నేరుగా నిధులిస్తూ లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుస్తోందని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
‘కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పేరుతో వేల కోట్ల కమీషన్లు దండుకుని రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా తీయించి అప్పుల కుప్పగా మార్చిన కేసీఆర్.. కేంద్రంపై విమర్శలు చేయడం సిగ్గు చేటు..’అని ధ్వజమెత్తారు.
మీరెందుకు వికేంద్రీకరించడం లేదు?
వికేంద్రీకరణ జరగాలని కేంద్రానికి నీతులు చెబుతున్న కేసీఆర్ ప్రభుత్వం.. గ్రామాలకు నిధులు, విధులను ఎందుకు వికేంద్రీకరించడం లేదో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని సంజయ్ డిమాండ్ చేశారు. ‘విద్య, వైద్యం సహా 29 అంశాలను గ్రామాలకే బదలాయించాలని రాజ్యాంగం స్పష్టంగా చెబుతున్నా.. రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ పంచాయతీల అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం గుప్పిట్లో పెట్టుకున్నది నిజం కాదా?
రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇళ్లు సహా వివిధ పథకాల లబ్ధి దారుల ఎంపిక గ్రామ సభల ద్వారానే జరగాలని రాజ్యాంగం స్పష్టంగా చెబుతున్నా వాటిపై ఎమ్మెల్యేలకు పెత్తనమిచ్చి.. పంచాయతీలను ఉత్సవ విగ్రహాలుగా మార్చిన కేసీఆర్ ది చిల్లర బుద్ధి కాక ఏమనాలి?’అని విమర్శించారు.