‘హలో ఫ్రెండ్స్‌.. హెలికాప్టర్‌లో ఆరంజ్‌ పార్టీ’ ఇప్పుడేమంటారో.. | Tejashwi Yadav hosts orange party in helicopter | Sakshi
Sakshi News home page

‘హలో ఫ్రెండ్స్‌.. హెలికాప్టర్‌లో ఆరంజ్‌ పార్టీ’ ఇప్పుడేమంటారో..

Apr 11 2024 3:22 PM | Updated on Apr 11 2024 4:07 PM

Tejashwi Yadav hosts orange party in helicopter - Sakshi

పాట్నా: హెలికాప్టర్‌లో ‘ఫిష్‌ పార్టీ’ వీడియో వివాదం తర్వాత మరో వీడియోను షేర్‌ చేశారు రాష్ట్రీయ జనతా దళ్ (RJD) నాయకుడు తేజస్వి యాదవ్. హెలికాప్టర్‌లో వికాశీల్ ఇన్సాన్ పార్టీ (VIP) చీఫ్ ముఖేష్ సాహ్నితో కలిసి ఫిష్ పార్టీ వివాదాన్ని రేకెత్తించిన సంగతి తెలిసిందే. తాజాగా తేజస్వి యాదవ్ గురువారం మరో వీడియోను పంచుకున్నారు. ఈ వీడియోలో వీరిద్దరూ బత్తాయి పండ్లను ఆస్వాదించడాన్ని చూడవచ్చు.

"హలో ఫ్రెండ్స్, ఈ రోజు హెలికాప్టర్‌లో ఆరెంజ్ పార్టీ జరుగుతోంది. వారు (బీజేపీ నేతలు) ఆరెంజ్ రంగుపై వివాదం చేయరు కదా?" అంటూ బీజేపీకి చురకలు అంటిస్తూ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ‘ఎక్స్‌’ (ట్విటర్‌)లో రాసుకొచ్చారు.  ఇంతకు ముందు షేర్‌ చేసిన వీడియోలో తేజస్వి యాదవ్ చేపలు తింటూ కనిపించడంపై బీజేపీ నేతలు భగ్గుమన్నారు. నవరాత్రుల వేళ మాంసాహార భోజనమా అంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. 

హెలికాప్టర్ లోపల చిత్రీకరించిన ఈ వీడియోలో వీఐపీ పార్టీకి నాయకత్వం వహిస్తున్న మాజీ మంత్రి ముఖేష్ సాహ్నితో కలిసి తేజస్వి యాదవ్ భోజనం చేస్తూ కనిపించారు. బీజేపీ విమర్శలపై తేజస్వి యాదవ్‌ కూడా కౌంటర్‌ ఇచ్చారు. ఆ వీడియో నవరాత్రి ఉత్సవాలకు ముందు రికార్డ్ చేసిందని, తనను విమర్శించేవారికి "తక్కువ ఐక్యూ" ఉందని ఆరోపించారు.

Advertisement
 
Advertisement
Advertisement