
పిఠాపురం: ‘జనసేన ఊసెత్తకూడదు. ఆ పార్టీ జెండా పట్టకూడదు. ఆ పార్టీ వారెవ్వరినీ కలవకూడదు’– పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ తన పార్టీ నేతలకు రోజూ ఇస్తున్న ఆదేశాలివి. ఆయన మాటలు నమ్మి పొత్తు ధర్మాన్ని సైతం పక్కన పెట్టి జనసేనకు దూరంగా ఉంటున్నారు నియోజకవర్గ తెలుగు తమ్ముళ్లు. కానీ, వర్మ మాత్రం కుటుంబ సమేతంగా.. గొల్లప్రోలు మండలం చేబ్రోలులో జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహించిన ఉగాది వేడుకలకు హాజరయ్యారు.
అంతే కాదు.. ఆయనకు స్వయంగా ఉగాది పచ్చడి తినిపించారు. ఆయన అనుసరిస్తున్న ఈ ద్వంద్వ వైఖరి రెండు పార్టీల నాయకులను అయోమయానికి గురి చేసింది. ఒకవైపు జనసేన కమిటీల్లో టీడీపీ నుంచి వెళ్లిన వారు ఉండకూడదంటూ రచ్చ చేసి, పవన్కు మాత్రం ఉగాది పచ్చడి తినిపిస్తారా? ఇదేం చోద్యం అంటూ వర్మ తీరుపై ఇరు పార్టీల నేతలు ముక్కున వేలేసుకుంటున్నారు.