PK: పిఠాపురం గోళీలు పని చేయట్లేదా? | Social Media Satires On Pawan Kalyan Pithapuram Fever | Sakshi
Sakshi News home page

పీకేకు పిఠాపురం గోళీలు పని చేయట్లేదా?

Apr 5 2024 10:15 AM | Updated on Apr 5 2024 2:59 PM

Social Media Satires On Pawan Kalyan Pithapuram Fever - Sakshi

పిఠాపురంలో గెలుపు మీద ఆశలు వదిలేసుకున్న పవన్‌.. ఆ బాధ్యతల్ని వర్మకే అప్పగించి.. 

కాకినాడ, సాక్షి: జనసేన విషయంలో పవన్‌ కల్యాణ్‌ చేస్తున్నదంతా పదేళ్లుగా ఆ పార్టీని వెంటపెట్టుకుని తిరిగిన వాళ్లెవరికీ సహించడం లేదు. సీఎం అవుతాడని కలలుగన్న అభిమానుల ఆశలు పటాపంచల్‌ చేస్తూ మళ్లీ చంద్రబాబుతోనే పొత్తుకు వెంపర్లాడడం.. ఇటు రాజకీయ వర్గాలను సైతం విస్మయానికి గురి చేసింది.  గత ఎన్నికల్లో 130 ఫ్లస్‌ సీట్లకు పోటీ చేసిన జనసేన.. ఇప్పుడు 21 స్థానాలకే పరిమితం కావడాన్ని జనసేన కేడర్‌ జీర్ణించుకోలేకపోతోంది. 

పోనీ ఆ 21 సీట్ల కేటాయింపులో అయినా జెన్యూన్‌గా ఉన్నాడా? అంటే అదీ లేదు. కనీసం రెండు పదుల స్థానాలకు అభ్యర్థుల్ని సైతం ఎంపిక చేయలేని పరిస్థితికి దిగజారిపోయాడు పవన్‌. అదే సమయంలో.. చంద్రబాబు సూచనల మేరకు టీడీపీ నుంచి పార్టీ మారిన వాళ్లకు.. అధికార వైఎస్సార్‌సీపీ ఫిరాయించిన వాళ్లకు సీట్లిచ్చి ఆయా స్థానాల్లో పాతుకుపోయిన జనసేన కేడర్‌ నుంచి విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో రాజీనామాల పర్వంతోనూ పవన్‌కు నిరసన తగిలింది. 

పోనీ తన సీటు విషయంలో అయినా కచ్చితత్వం ప్రదర్శిస్తున్నాడా? అంటే అదీ లేదు. అసలు పిఠాపురంలో పోటీ చేయడం పవన్‌ నామినేషన్‌ వేసే దాకా అనుమానమే అనే పరిస్థితిని తీసుకొచ్చారు ఇప్పుడు. భీమవరం, గాజువాక ఓటర్లకు భరోసా ఇవ్వలేకపోయిన పవన్‌.. ఇప్పుడు పిఠాపురం ఓటర్లకు ఏం భరోసా ఇస్తాడనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

వారాహి పేరిట ఎన్నికల ప్రచారం మొదలుపెట్టి రెండ్రోజులు మామూలు హడావిడి చేయలేదు. బహిరంగ సభతో పాటు ఆటోలెక్కి రోడ్ల మీద ఓ హడావిడి చేశాడు. అదేంటో.. ఆ రెండ్రోజులు తిరగక మునుపే జ్వరం పేరుతో నియోజకవర్గాన్ని వీడారు. పార్టీ నిర్వహణను నాదెండ్ల మనోహర్‌కు.. నియోజకవర్గ ప్రచార బాధ్యతలను తనపై గుర్రుగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మకు అప్పగించారు. అంటే పిఠాపురంలో గెలుపుపై పవన్‌ ఆశలు వదిలేసుకున్నట్లేనా?.. ఆ మాత్రం జ్వరానికి పవన్‌కు పిఠాపురంలో గోళీలు దొరకవా? అనే కామెంట్లు వినిపిస్తు‍న్నాయి నియోజకవర్గంలో.  

చంద్రబాబుకి బానిసత్వం ప్రదర్శించడంలో పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు ఆల్‌ టైం రికార్డు సృష్టిస్తున్నారు. ఎన్నికల వేళ పార్టీని పూర్తిగా చంద్రబాబు చేతిలో పెట్టారు. బాబు నుంచి వెన్నుపోటు రాజకీయం నేర్చుకుని దానిని జనసేన కేడర్‌పైనే ప్రయోగిస్తున్నారు.  తన చుట్టూరా ఎప్పుడూ బౌన్సర్లను ఉంచుకునే పవన్‌.. పార్టీ నేతలు, కార్యకర్తలు సహా ఎవరినీ దగ్గరకు రానీయకుండా జాగ్రత్తపడుతుంటారు. అలాంటిది పార్టీ మీటింగ్‌లలో తనపై బ్లేడ్‌లతో దాడి జరిగిందంటూ  ఆరోపణలకు దిగడం మరో కొసమెరుపు.  ఈ ఆరోపణల్ని జనసేన శ్రేణులు సైతం స్వాగతించడం లేదు. పోనీ దాడికి సంబంధించిన ఆధారాలు ఏమైనా చూపించారా? అంటే అదీ లేదు. ఇక.. ప్యాకేజీ స్టార్‌, దత్తపుత్రుడు అనే ట్యాగ్‌లకు అదనంగా ఇప్పుడు అదనంగా బ్లేడ్‌ బాబ్జీ అంటూ పవన్‌కు మరో ట్యాగ్‌ తగిలించారు. అట్లుంటది ప్యాకేజీ స్టార్‌తో అంటూ సెటైర్లు వేస్తున్నారు.  అలా పవన్‌ ఇటు జనాల్లో.. అటు జనసేన శ్రేణుల్లో రాజకీయంగా మరి చులకనైపోతున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement