మళ్లీ మంచి రోజులు వస్తాయి: సజ్జల | Sajjala Ramakrishna Reddy Comments In Arya Vaishya Atmiya Meeting | Sakshi
Sakshi News home page

మళ్లీ మంచి రోజులు వస్తాయి: సజ్జల

Jun 14 2026 6:28 PM | Updated on Jun 14 2026 6:40 PM

Sajjala Ramakrishna Reddy Comments In Arya Vaishya Atmiya Meeting

సాక్షి, తాడేపల్లి: మళ్లీ మంచి రోజులు వస్తాయని.. త్వరలోనే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని వైఎస్సార్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్య వైశ్యులు అత్యంత సున్నిత మనస్కులు.. ఘర్షణ లేని వాతావరణం కోరుకునేవారిలో ఆర్యవైశ్యులు ముందుంటారన్నారు. సమావేశంలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఆర్య వైశ్య సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

‘‘ఇప్పుడు ఏపీలో ప్రశాంత వాతావరణం లేనే లేదు. కూటమి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం అడ్రస్ లేకుండా పోయింది. రాష్ట్రంలో ఉన్నదంతా అరాచకమే. తమ పార్టీ కాని వారందరినీ వేధించి.. వైఎస్సార్‌సీపీ ముద్ర వేస్తున్నారు. ప్రజల పక్షాన బలంగా ప్రశ్నించేది వైఎస్సార్‌సీపీ మాత్రమే. వైఎస్సార్‌సీపీ 10 వేల మంది ఆర్యవైశ్యులు ఉన్నారు. మహిళలు కూడా రాజకీయంగా బయటికి వస్తున్నారు. వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడ్డ వారికి కూడా వైఎస్‌ జగన్ అండగా నిలిచారు’’ అని సజ్జల పేర్కొన్నారు.

‘‘ఒకప్పుడు ప్రభుత్వ బడులకు వెళ్లడం నామోషీగా భావించేవారు. ప్రభుత్వ బడులకు వెళ్లడం గొప్పగా భావించేలా చేసిన ఘనత జగన్‌కు దక్కింది.  స్కూల్ బ్యాగ్ నుంచి ప్రతి అంశంలోనూ జగన్ కేర్ తీసుకున్నారు. ఈ ప్రభుత్వంలో అకడమిక్ ప్రారంభమైనప్పటికీ స్కూల్ బుక్స్, బ్యాగ్‌ల ఊసే లేదు. రాష్ట్ర ప్రజలపై ఎలాంటి భారం పడకూడదని వైఎస్‌ జగన్ చూశారు. చంద్రబాబు అమరావతి పేరుతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నాడు’’ అంటూ సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు.

సొమ్ము ఆర్యవైశ్యులది.. సోకు మాత్రం చంద్రబాబు, పవన్‌ది
మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘‘వాసవీమాత ఆలయాల్లో ప్రభుత్వ జోక్యం ఉండొద్దని జీవో తెచ్చిన ఘనత వైఎస్సార్ , రోశయ్యలదే. ఆర్యవైశ్యులకు సంబంధించి కొన్ని ట్రస్ట్‌లు ఉన్నాయి. ప్రభుత్వ కబంధ హస్తాల్లో ఉన్న ఆర్యవైశ్యుల ట్రస్ట్‌లపై వైఎస్‌ జగన్ ఆర్యవైశ్యులకే హక్కులు కల్పించారు. ఎండోమెంట్ పరిధి నుంచి తప్పించి దుర్వినియోగం కాకుండా జీవో ఇచ్చారు. వైఎస్‌ జగన్‌ చేసినంత మేలు ఆర్యవైశ్యులకు మరెవరూ చేయలేదు. ఎండోమెంట్ పరిధిలో ఉన్న ఆర్య వైశ్యుల ట్రస్ట్‌లపై ఆర్య వైశ్యులకే వైఎస్‌ జగన్ హక్కులు కల్పించారు.

..గతంలో రాష్ట్రంలో ఉన్న ఆర్య వైశ్యులంతా ఆలయాల్లో దర్శనాలకు వెళ్లేవారు. కూటమి ప్రభుత్వంలో ఆలయాల్లో ఆర్య వైశ్యులకు అవకాశం లేకుండా చేశారు. అమరావతిలో వృధాగా పడి ఉన్న స్థలంలో పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేశారు. విగ్రహం ఏర్పాటు చేసిన స్థలంపై ఆర్యవైశ్యులకు ఎలాంటి హక్కు లేదంటున్నారు. పొట్టి శ్రీరాములు విగ్రహం పెట్టడానికి డబ్బులిచ్చింది ఆర్య వైశ్య సంఘం. సొమ్ము ఆర్యవైశ్యులది సోకు మాత్రం చంద్రబాబు, పవన్‌ది’’ అంటూ వెలంపల్లి దుయ్యబట్టారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement