తెలంగాణ ఎందుకు అభివృద్ధి కాలేదు?: రాజ్‌నాథ్‌ సింగ్‌ | Union Minister Rajnath Singh Serious Comments On KCR At Jammikunta Public Meeting- Sakshi
Sakshi News home page

ఆ మూడు రాష్ట్రాల్లో అభివృద్ధి.. తెలంగాణలో జరగలేదేం?: రాజ్‌నాథ్‌ సింగ్‌

Oct 16 2023 2:37 PM | Updated on Oct 16 2023 3:11 PM

Rajnath Singh Serious Comments On KCR At Jammikunta Meeting - Sakshi

సాక్షి, కరీంనగర్‌: తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం అవినీతమైందని బీజేపీ అగ్రనేత, కేంద్ర రక్షణశాఖమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ధ్వజమెత్తారు. జమ్మికుంటలో సోమవారం నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో రాజ్‌నాథ్‌ మాట్లాడుతూ.. తెలంగాణలో కుటుంబ అభివృద్ధి మాత్రమే జరుగుతోందని విమర్శించారు. కేసీఆర్‌ కుటుంబ సభ్యులంతా అధికారాన్ని చేలాయిస్తున్నారని.. అధికారం లేకుండా కేసీఆర్‌ ఉండలేరని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

వాజ్‌పేయి ప్రభుత్వ హాయంలో మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేశామని రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. ఆయా రాష్ట్రాల్లో అభివృద్ధి జరుగుతోందని, మరి తెలంగాణలో అభివృద్ధి ఎందుకు జరగడం లేదు? అని రాజ్‌నాథ్‌, బీఆర్‌ఎస్‌ సర్కార్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. తెలంగాణ మాత్రం 10 ఏళ్లలో వెనకబడిపోయిందని అన్నారు. బీజేపీ పాలిత ప్రాంతాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయన్నారు. బీజేపీ సారథ్యంలో దేశం అభివృద్ధి పథంలో పయనిస్తోందని తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. 

‘తెలంగాణ ప్రభుత్వం లీకేజీల ప్రభుత్వం. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ కృష్టి కూడా ఉంది. కేవలం కేసీఆర్‌ వల్లే తెలంగాణ ఏర్పడలేదు.  కేసీఆర్‌ ఇచ్చిన వాగ్ధానాలు నెరవేర్చలేదు. హైదరాబాద్‌ తప్ప ఎక్కడా అభివృద్ధి జరగలేదు. దేశానికి గుజరాత్‌ అభివృద్ధి మోడల్‌. అభివృద్ధి మంత్రంతోనే గుజరాత్‌లో 27 ఏళ్లుగా గెలుస్తోంది.  విభజన సమస్యలు పరిష్కారం కాకపోవడానికి కాంగ్రెస్‌ తీరే కారణం’ అని రాజ్‌నాథ్‌ సింగ్‌ మండిపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement