
నాగర్కర్నూల్లో మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
నలుగురి స్వార్థం కోసం నాలుగు గోడల మధ్య రూపకల్పన
బీఆర్ఎస్ నేతల మాట వినలేదనే వీఆర్వో వ్యవస్థ రద్దు
ధరణిపై సదస్సులు పెట్టి ఉంటే నేతల వీపులు చింతపండయ్యేవి
అన్ని సమస్యలకు పరిష్కారంగానే భూ భారతి
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
గద్వాల జిల్లాలో ఉద్రిక్తతల మధ్య మంత్రి పర్యటన
నాగర్కర్నూల్/గద్వాల: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాలుగు గోడల మధ్య కూర్చొని, నలుగురి స్వార్థం కోసం రూపొందించిన చట్టమే ధరణి అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి విమర్శించారు. శనివారం జోగుళాంబ గద్వాల జిల్లా ధరూరు, నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో భూ భారతిపై అవగాహన సదస్సులు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకులు చెప్పినట్లు చేయలేదని వీఆర్వో వ్యవస్థనే రద్దు చేశారని ఆరోపించారు.
ఎప్పుడైనా, ఏ నియోజకవర్గంలోనైనా ధరణిపై సమావేశం పెట్టారా? అన్ని ప్రశ్నించారు. ఒకవేళ సమావేశం పెట్టి ఉంటే నాయకుల వీపులు చింతపండయ్యేవని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు, వారి బంధువుల కోసమే ధరణి తెచ్చారని ఆరోపించారు. ధరణిలో రాత్రికి రాత్రే భూ యజమానుల పేర్లు మారిపోయేవని తెలిపారు. అన్ని సమస్యలకు పరిష్కారంగానే భూ భారతి చట్టం తెచ్చామని చెప్పారు. కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు రాజేష్రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, మేఘారెడ్డి, బండ్ల కృష్ణమోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కృష్ణమోహన్రెడ్డి ఏ పార్టీ..?
గద్వాల జిల్లా ధరూరు మండలంలో మంత్రి పర్యటన ఉద్రిక్తతలు, అలకల మధ్య సాగింది. అవగాహన సదస్సు పూర్తిగా అధికారిక కార్యక్రమం కావడంతో అధికారులు ప్రొటోకాల్ పాటించారు. దీంతో మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరిత, మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్ సభా వేదికపైకి రాకుండా దూరంగా ఉండిపోయారు. దీంతో వారి అనుచరులు ఆందోళనకు దిగారు. కాసేపు అక్కడే వేచి చూసిన సంపత్కుమార్ వేదికపైకి పిలవకపోవడంతో సభాప్రాంగణం నుంచి వెళ్లిపోయారు.
సరిత అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ నాయకురాలిని ఇలా అవమానించడం ఏంటని మండిపడ్డారు. లోక్సభ సభ్యుడు మల్లురవితో వాగ్వివాదానికి దిగారు. దీంతో ఆయన వారిని సముదాయించారు. స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డికి వ్యతిరేకంగా సరిత, సంపత్కుమార్ వర్గీయులు నినాదాలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందినట్లు చెబుతున్న ఎమ్మెల్యే.. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో సభాముఖంగా ప్రకటించాలని నినాదాలు చేయడంతో సభలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆందోళన చేస్తున్న నాయకులు, కార్యకర్తలను పోలీసులు సభా ప్రాంగణానికి దూరంగా తీసుకెళ్లారు.
హెలిప్యాడ్లో మంటలు: మంత్రి పొంగులేటి పర్యటనలో చిన్న అపశ్రుతి చోటు చేసుకుంది. నాగర్కర్నూల్ కలెక్టరేట్ వద్ద ఉన్న హెలిప్యాడ్ వద్ద హెలికాప్టర్ ల్యాండింగ్ సిగ్నల్ కోసం స్మోక్ ఫైర్ చేసిన సమయంలో కింద ఉన్న ఎండు గడ్డికి మంటలు అంటుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. దీంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు.