సాక్షి,తాడేపల్లి: చంద్రబాబు పాలనపై మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు గుప్పించారు. బాబు పాలనలో అరాచకం రాజ్యమేలుతుందన్న ఆయన.. పోలీసులతో కూటమి ప్రభుత్వం అడ్డగోలుగా చాకిరి చేయించుకుంటుందని అన్నారు. పోలీసులకు అన్యాయం జరుగుతుంటే కానిస్టేబుల్ కుమారుడు పవన్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. సోమవారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో నాని మీడియాతో మాట్లాడారు.
‘ప్రభుత్వ విభాగంలో అన్నీ శాఖల్లో మోసం చేసినట్లుగా కానిస్టేబుళ్లను మోసం చేస్తున్నారు. కానిస్టేబుళ్లకు ఇచ్చే సరండర్ లీవల్ను వన్ బై టూ చేశారు.కానిస్టేబుళ్లకు ఇవ్వాల్సిన ఆరు సరండర్ లీవ్లు పెండింగ్లో ఉన్నాయి. పోలీసులకు టీఏలు కూడా ఇవ్వడం లేదు. లా అండ్ ఆర్డర్ పని చేసే ఒక్కో పోలీస్కు రూ.70వేలకు పైగా బాకీ ఉన్నారు.మందు తాగమని చంద్రబాబే చెబుతారు. తర్వాత డ్రండ్ అండ్ డ్రైవ్లు పెడతారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పేరు చెబితే పోలీసులకు నిద్ర పట్టడం లేదు.
ప్రతి పీఎస్ పరిధిలో రోజుకు ఐదు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెట్టాలని టార్గెట్ పెట్టారు. చంద్రబాబు మాటలను నమ్మి పోలీసులు వైఎస్సార్సీపీ నేతలను, కార్యకర్తలను కొట్టారు. పోలీసులకు వర్క్ ఫ్రమ్ హోం దేవుడెరుగు, వడగాల్పుల్లో అల్లాడి పోతున్నారు. జీవో 329 ఎందుకు అమలు కావడంలేదో చంద్రబాబు చెప్పాలి. ఏపీఎస్పీలో పదేళ్లు సర్వీస్ నిండినవారిని ఏఆర్కు ఎందుకు పంపడం లేదు?.ఏపీఎస్పీలో వెట్టి చాకిరి చేస్తూ రిటైర్ అవుతున్నారు. పోలీసుల పట్ల కూటమి ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోంది.

పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి కాదు ఉప్మా మంత్రి. పోలీసులకు అన్యాయం జరుగుతుంటే కానిస్టేబుల్ కుమారుడు పవన్ ఎక్కడున్నారు. ఓట్లు అడుకునేటప్పుడు కానిస్టేబుల్ కుమారుడు ఇప్పుడు ఎందుకు మాట్లాడరు?. హోం మంత్రి అనిత హోం శాఖ గురించి తప్పితే అన్నీ మాట్లాడుతారు. వైఎస్ జగన్ను తిట్టడానికి మాత్రమే మంత్రి అనితను వాడుకుంటున్నారు’అని ధ్వజమెత్తారు.


