
సాక్షి, చిత్తూరు జిల్లా: జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి దారుణం ఉందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరు బీవీరెడ్డి కాలనీలో పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సతీమణి నీరజను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్రెడ్డి, కుటుంబ సభ్యులు పరామర్శించారు. అనంతరం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ఎప్పుడూ లేని విధంగా మామిడి కాయలు కొనుగోలు చేసేందుకు ఫ్యాక్టరీ యాజమాన్యాలు ముందుకు రావడం లేదన్నారు.
వైఎస్ జగన్ పాలనలో మామిడి రైతులకు మేలు జరిగింది. గత మూడేళ్లుగా కిలో మామిడి సరాసరి రూ.25 రూపాయలకు అమ్మకం చేశారు. గత ఏడాది కిలో మామిడి 27 రూపాయలుపైనే అమ్మకం చేశారు. కూటమి ప్రభుత్వం పాలనలో కిలో మూడు రూపాయలకు అమ్మకం చేద్దామన్న కొనుగోలు చేయని దుస్థితి ఏర్పడింది. చంద్రబాబు గతంలో వ్యవసాయం దండగ అన్న వ్యక్తి.. ఈరోజు రైతులకు ఏవిధం మేలు చేస్తాడు. రాష్ట్రంలో మామిడి, మిర్చి, పొగాకు, టమోటా పంటకు గిట్టుబాటు ధర కల్పించలేదు. మరో నాలుగేళ్లు రైతులకు ఈ పాలనలో ఇబ్బందులు తప్పవు’’ అని పెద్దిరెడ్డి అన్నారు.

రైతులకు ఏడాదిగా తీవ్ర అన్యాయం: మిథున్రెడ్డి
వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులకు ఏడాదిగా తీవ్ర అన్యాయం జరుగుతోందని.. మామిడి, పాలు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. గత 20 ఏళ్లలో ఎన్నడు లేని విధంగా మామిడి రైతులు కిలో రూ.3 రూపాయలకు అమ్మాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అమూల్ పాల డైరీ దెబ్బతీసి లీటర్ పాలకు 4-5 రూపాయలకు తక్కువగా కొనుగోలు చేస్తున్నారు. వైఎస్ జగన్ రైతుల పక్షాన పోరాటం చేస్తుంటే జీర్ణించుకోలేక పోతున్నారు. వ్యక్తిగతంగా టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రజలు పక్షాన పోరాటం కొనసాగిస్తాం’’ అని మిథున్రెడ్డి చెప్పారు.
