
సాక్షి, ఖమ్మం: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఏసీబీ విచారణకు వెళ్లిన నేపథ్యంలో మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ విచారణకు అంత హంగామా అవసరమా?. ఏసీబీ విచారణలో ప్రభుత్వ ప్రమేయం ఉండదు. విచారణ తర్వాత నివేదికల ప్రకారమే చర్యలు ఉంటాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘కాంగ్రెస్ ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలు ఉండవు. పేదోళ్ల సొమ్ము అక్రమ దారి పట్టింది.. అందుకే విచారణ జరుగుతోంది. కేటీఆర్ ఏదో జరగబోతున్నట్టుగా హల్చల్ చేస్తున్నారు. ఏసీబీ విచారణలో ప్రభుత్వ ప్రమేయం ఉండదు. విచారణ తర్వాత నివేదికల ప్రకారమే చర్యలు ఉంటాయి. కాళేశ్వరం, ఫార్ములా రేసుపై ఏసీబీ విచారణపై నివేదికల ఆధారంగానే చర్యలుంటాయి. దీనిపై బీఆర్ఎస్ నేతలకు అంత హంగామా అవసరమా?.
త్వరలోనే తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ఉంటాయి. బీసీ రిజర్వేషన్లకు కట్టబడి ఉన్నాం. పెంచిన రిజర్వేషన్లను అమలు చేసి తీరుతాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే హవా. అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం. మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్లు రాలేదని ఎవరూ బాధపడొద్దు. ఏడాదిన్నర కాలంలోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాం. విడతల వారీగా అర్హలైన ప్రతీ ఒక్కరికీ ఇళ్లు ఇప్పించే బాధ్యత నాది’ అంటూ వ్యాఖ్యలు చేశారు.