‘ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం.. రామోజీరావు దిగజారిపోయారు’

Minister Kodali Nani Comments On Chandrababu - Sakshi

ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు అసత్య కథనాలు

రాష్ట్రం ముక్కలవ్వడానికి చంద్రబాబే ప్రధాన కారకుడు

మంత్రి కొడాలి నాని

సాక్షి, అమరావతి: చంద్రబాబు, ఎల్లో మీడియా ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని నిప్పులు చెరిగారు. గురువారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు అసత్య కథనాలు రాస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. చంద్రబాబు అబద్ధాలను ప్రచురిస్తూ రామోజీరావు దిగజారిపోయారు. మార్కెట్లో ఉన్న ధరలకన్నా అధిక ధరలు ఉన్నట్టు ప్రచురిస్తున్నారని దుయ్యబట్టారు.

చదవండి: కుప్పం పర్యటన.. జనంపై చంద్రబాబు చిందులు

రైతు పండించిన పంటకు  గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకున్నాం. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సొమ్మును లూటీ చేశారు. ఈనాడు, ఈటీవీ, టీవీ5, ఎబీఎన్‌ ఆంధ్రజ్యోతిని పూర్తిగా నిషేధిస్తున్నాం. అసత్యాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే మీడియాను దూరం పెడుతున్నాం. సీఎం జగన్‌ పాలన ఈ రాష్ట్రంలో 30 ఏళ్ల పాటు ఉంటుంది. అభివృద్ధి, సంక్షేమానికి పాటుపడే సీఎం జగన్‌ను ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. రాష్ట్రం ముక్కలవ్వడానికి చంద్రబాబు ప్రధాన కారకుడని’’ కొడాలి నాని మండిపడ్డారు.

‘‘హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేసి నిర్మాణం పూర్తి చేసింది మహానేత వైఎస్సార్‌. ఔటర్‌ రింగ్‌రోడ్డుకు శంకుస్థాపన చేసింది వైఎస్సారే. చంద్రబాబు ఇందులో చేసిందేమీ లేదని’’  మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు.

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top