
సాక్షి, వైఎస్సార్ జిల్లా: జమ్మలమడుగులో కూటమి నేతల ప్రత్యేక రాజ్యాంగం నడుస్తోంది. తాము చెప్పిందే వేదమంటూ ప్రభుత్వ భూమిని టీడీపీ యువనేత ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేస్తున్నారు. నిన్న అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమ వివాదంలో బాబాయ్ ఎంట్రి ఇవ్వగా.. అది మరువక ముందే మరొక భూదందాకు అబ్బాయ్ తెరలేపారు. బాబాయ్, అబ్బాయ్లు కలిసి దోచేసుకుంటున్నారు.

పెద్ద ముడియం మండలం పాపాయపల్లిలో 500 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేసేశారు. ఎటువంటి అనుమతులు లేకుండా భూమిని చదును చేయించిన టీడీపీ యువనేత.. ఆ ప్రాంతంలో ఏర్పాటైన సోలార్ కంపెనీకి ప్రభుత్వ భూమిని దారాదత్తం చేసేందుకు కబ్జాకు తెరతీశారు. ఎకరా రూ.6 లక్షల చొప్పున సదరు కంపెనీకి ప్రభుత్వ భూమిని అమ్మేందుకు సిద్ధమయ్యారు.

ఎన్వోసీలు తీసుకురావడం, చదును చేయడం అంతా మా పనేనంటున్న యువనేత.. 500 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు కంపెనీ అప్పనంగా అమ్మేస్తున్నారు. ఆ 500 ఎకరాల్లో పేదలకిచ్చిన డీకేటీ పట్టాలున్నా, వాటిపై కోర్టులో కేసు ఉన్నా టీడీపీ యువనేత పట్టించుకోవడం లేదు. అసలు అక్కడ ఏం జరుగుతుందో తమకు తెలియదని తహశీల్దార్ చెబుతున్నారు. తమ భూములను దౌర్జన్యంగా చదును చేస్తున్నారంటు డీకేటీ పట్టాదారులు వాపోతున్నారు.