కేసీఆర్ నాయకత్వంలో మలిదశ ఉద్యమమే
రాష్ట్ర ఆవిర్భావానికి కారణం
వలసలకు ప్రతీకగా ఉన్న తెలంగాణను దేశానికి అన్నపూర్ణగా మార్చారు
మలేసియాలో తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధి, నీళ్లు, నిధులపై అవగాహన లేకుండా మాట్లాడుతున్న నాయకులు రాష్ట్ర ప్రయోజనాలకు విఘా తం కలిగించేలా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు ధ్వజమెత్తారు. అలాంటి విషనాగులతో తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వ్యాఖ్యానించారు. తెలంగాణపై అబద్ధాలు ప్రచారం చేస్తున్న నాయకులను ప్రజలు నమ్మబోరని పరోక్షంగా సీఎం రేవంత్రెడ్డిని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. 2028లో మళ్లీ గులాబీ జెండా ఎగురుతుందని.. కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. మలేసియా తెలుగు అసోసియేషన్ (మైటా), బీఆర్ఎస్ ఎన్నారై మలేసియా శాఖ కౌలాలంపూర్లో సంయుక్తంగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ చరిత్ర, రాష్ట్ర సాధన ఉద్యమం, బీఆర్ఎస్ పాలనలో సాధించిన విజయాలు, భవిష్యత్ లక్ష్యాలపై ప్రసంగించారు. తెలంగాణ కేవలం ఒక రాష్ట్రం కాదని, వేల ఏళ్ల చరిత్ర, సంస్కృతి, పోరాటాల వారసత్వాన్ని మోస్తున్న జాతి అని కేటీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణవాసులమని గర్వపడే స్థాయికి రాష్ట్రం
‘నాది తెలంగాణ.. నాది తెలంగాణ జాతి.. నేను తెలంగాణ బిడ్డను’అని ప్రతి తెలంగాణవాసి గర్వంగా చెప్పుకునే స్థాయికి రాష్ట్రం చేరిందని కేటీఆర్ అన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ బతుకమ్మను జరుపుకునే ప్రత్యేక జాతి తెలంగాణ జాతి మాత్రమేనని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం దశాబ్దాల పోరాటాలు, వేలాది మంది త్యాగాల ఫలితమని కేటీఆర్ గుర్తుచేశారు. కేసీఆర్ నాయకత్వంలో సాగిన మలిదశ ఉద్యమమే రాష్ట్ర ఆవిర్భావానికి కారణమైందన్నారు. అన్ని వర్గాలను ఏకం చేసిన ప్రజాస్వామ్య ఉద్యమం ఫలితంగానే తెలంగాణ సాధ్యమైందని చెప్పారు. ఒకప్పుడు కరువులు, వలసలకు ప్రతీకగా ఉన్న తెలంగాణను దేశానికి అన్నపూర్ణగా మార్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు వ్యవసాయం, సాగునీరు, పరిశ్రమలు, విద్యుత్, తలసరి ఆదాయం, స్థూల రాష్ట్ర ఉత్పత్తి వంటి రంగాల్లో తెలంగాణను అగ్రస్థానంలో నిలబెట్టిందీ బీఆర్ఎస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతిని ప్రపంచ వేదికపై గౌరవప్రదంగా నిలబెట్టిన నాయకుడు కూడా కేసీఆరేనని కొనియాడారు.
తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి
ప్రపంచం వేగంగా మారుతున్న నేపథ్యంలో ఏఐ వంటి రంగాలు భవిష్యత్తును నిర్దేశిస్తున్నాయని కేటీఆర్ అన్నారు. వచ్చే 25 ఏళ్ల తెలంగాణ కోసం బీఆర్ఎస్కు స్పష్టమైన విజన్ ఉందన్నారు. 24 గంటల నాణ్యమైన తాగునీటి సరఫరా, బలోపేతమైన ప్రజారవాణా వ్యవస్థ, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన మౌలిక వసతుల కల్పన తమ లక్ష్యాలని వెల్లడించారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రవాస భారతీయులు భాగస్వాములు కావాలని.. అనుభవం, సూచనలతో రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఎల్.రమణ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ ఎన్నారై ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో తెలంగాణ ప్రవాసులు పాల్గొన్నారు.


