పావు వంతు రైతులే అర్హులా? | KTR Sensational Comments on CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

పావు వంతు రైతులే అర్హులా?

Jul 19 2024 5:57 AM | Updated on Jul 19 2024 6:50 AM

KTR Sensational Comments on CM Revanth Reddy

రేవంత్‌ రుణమాఫీ పేరిట రైతాంగాన్ని మోసగిస్తున్నారు: కేటీఆర్‌  

40 లక్షల మంది రైతుల్లో 11 లక్షల మందికే ఇస్తారా?

సాక్షి, హైదరాబాద్‌: రైతు రుణమాఫీ పేరిట రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభు త్వం రైతాంగాన్ని మరో మారు మోసం చేస్తోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మండిపడ్డారు. రైతుబంధు కింద జూన్‌లో రైతులకు ఇవ్వాల్సిన నిధుల్లో నుంచి రూ.7 వేల కోట్లను రుణమాఫీ కోసం దారి మళ్లించిందని కేటీఆర్‌ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. హక్కుగా రావాల్సిన రైతుబంధు డబ్బు నుంచి కొంత మొత్తాన్ని విదిల్చి రుణమాఫీ చేస్తున్నట్లుగా పోజులు కొడుతున్నారని ఎద్దేవా చేశారు.

 40 లక్షల మంది రైతులు లక్ష రూపాయల రుణం తీసుకుంటే 11 లక్షల మందిని మాత్రమే ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నించారు. 2014, 2018లో కేసీఆర్‌ ప్రభుత్వం చేసిన రైతు రుణమాఫీతో పోలిస్తే పావువంతు రైతులే అర్హత సాధించారన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం 2014లోనే రూ.లక్షలోపు రుణాలను మాఫీ చేసేందుకు రూ. 16,144 కోట్లు వెచి్చంచి.. సుమారు 35 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చిందని పేర్కొన్నారు. మేనిఫెస్టోలో హామీ మేరకు కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.2 లక్షల వరకు ఉన్న పంట రుణాలు మాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు. 

పోలీసులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వండి 
ప్రజలతో వ్యవహరించాల్సిన తీరుపై పోలీసు సి బ్బందికి ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేయా  లని కేటీఆర్‌ ‘ఎక్స్‌’లో కోరారు. ఓ వాహనదారుడిని పోలీసులు దుర్భాషలాడుతున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడాన్ని ప్రస్తావిస్తూ దీన్ని పోస్ట్‌ చేశారు. పౌరుడిపై పోలీసులు వాడిన భాషపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, పోలీసు శాఖ, డీజీపీకి ఇది అంగీకారయోగ్యమైన భాషేనా అని ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement