సాక్షి, వనపర్తి జిల్లా: కాంగ్రెస్ నేతలకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని.. దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలన్నారు. శనివారం ఆయన వనపర్తి నియోజకవర్గం పెబ్బేరులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కరెంటు కోతలతో రైతులు అల్లాడుతున్నారని.. రైతులకు అన్యాయం జరిగితే ఊరుకోమంటూ తేల్చి చెప్పారు.
‘‘ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదన్న కేటీఆర్.. నీళ్లు ఇవ్వకపోతే గల్లా పట్టుకుని అడుగుతామన్నారు. తాము తప్పు చేశామని తేలితే చర్యలు తీసుకోండి.. అక్రమాలు జరిగితే ప్రజలకు చూపించి యాక్షన్ తీసుకోవాలన్నారు. రైతులు విద్యుత్, సాగునీటి కష్టాలు చెప్పుకున్నారు.. ప్రకృతి కావాల్సినన్ని నీళ్ళు ఇచ్చినా రైతులకు సాగునీరు లేదు’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
‘‘ఉమ్మడి రాష్ట్రంలో ఏడు మెగా వాట్ల సామర్థ్యం ఉండేది. 24 వేల మెగా వాట్లకు విద్యుత్ సామర్థ్యం పెంచినం. అత్యల్పంగా కృష్ణా నీళ్లను తెలంగాణ వాడుకుంది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ముప్పై శాతం కంటే ఎక్కువ నీళ్లు వాడుకున్నాం. పాలమూరులో పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్ట్లుగా మార్చినం. ఏడు లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. వరద వస్తుందంటే వెంటనే నీళ్లు మళ్లించే వాళ్లం.
..చెక్ డ్యామ్లు, చెరువులు నింపి పాలమూరులో నీళ్లు ఇచ్చాం. రెండు సబ్ స్టేషన్లకు రైతులతో కలిసి వెళ్ళాం. అధికారులు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఆరు గంటలకు మించి విద్యుత్ సరఫరా కావట్లేదని రైతులు చెప్తున్నారు. లో వోల్టేజ్, తరచూ కట్ చేయడంతో మోటార్లు కాలిపోతున్నాయని అంటున్నారు. నీళ్లు, కరెంట్ ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విద్యుత్ కష్టాలు, తాగునీటి కష్టాలు ఉన్నాయని చెప్తున్నారు. అన్ని ఉన్నప్పటికీ ఇవ్వలేని స్థితిలో కాంగ్రెస్ సర్కార్ ఉంది’’ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: హైకోర్టు తీర్పుపై దానం సంచలన నిర్ణయం


