సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. మంత్రివర్గం నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేయడంతో చిన్నారెడ్డిపైనా కూడా కాంగ్రెస్ హై కమాండ్ వేటు వేసింది. ప్లానింగ్ కమిషన్ వైస్ ఛైర్మన్గా చిన్నారెడ్డిని తొలగించింది. దీంతో సీఎం రేవంత్రెడ్డి తన పంతాన్ని నెగ్గించుకున్నారు. దీంతో పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న నేతలకు సీఎం రేవంత్ బలమైన సంకేతం పంపినట్లయింది.
రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు, మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత సీఎంను ఉద్దేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, దీనిపై వ్యక్తమైన భిన్నాభిప్రాయాలు, ప్రభుత్వంపై కొందరు ఎమ్మెల్యేలు, నేతలు బహిరంగంగా చేస్తున్న వ్యాఖ్యలు, జిల్లాల్లో బయటపడుతున్న విభేదాల నేపథ్యంలో రాష్ట్ర నేతలను ఢిల్లీకి పిలిపించిన అధిష్టానం వారితో చర్చించిన సంగతి తెలిసిందే.
తన పైన కొండా సురేఖ కుమార్తె చేసిన వ్యాఖ్యలను రేవంత్రెడ్డి సీరియస్గా తీసుకున్నారు. కొండా సురేఖ ఆ వ్యాఖ్యలను ఖండించకపోవటం, అనంతరం ఆమె స్వయంగా చేసిన వ్యాఖ్యలతో ఆగ్రహంతో ఉన్న రేవంత్.. సురేఖ చేసిన ఆరోపణలను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఖర్గేకు వివరించారు. కొండా సురేఖ వ్యవహారాన్ని ఉపేక్షిస్తే పార్టీ కేడర్కు తప్పుడు సంకేతాలు వెళ్లడంతో పాటు రాష్ట్ర నాయకత్వంపై లేనిపోని అపోహలకు తావిచ్చినట్లు అవుతుందని సీఎం చెప్పినట్లుగా తెలిసింది. ఇంత జరిగాక కూడా ఆమెపై చర్యలు తీసుకోకుండా ఉపేక్షించడం తగదని అన్నట్లు సమాచారం. రేవంత్ పట్టుతో కొండా సురేఖ, చిన్నారెడ్డిపైనా కూడా కాంగ్రెస్ అధిష్టానం వేటు వేసింది.
మంత్రి వర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్కు గవర్నర్కు సీఎం రేవంత్రెడ్డి సిఫార్సు చేశారు. ఇదిలా ఉండగా.. కొండా ఫ్యామిలీ ఏం పార్టీలో చేరబోతుంది?. తెలంగాణ రాజకీయాల్లో తరువాత ఏం జరగనుంది?. కొండా రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది?. కొండా సురేఖ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా?. ఆమె కాంగ్రెస్లో కొనసాగే అవకాశముందా?’’ అనే చర్చ నడుస్తోంది.


