కేసీఆర్‌పై కిషన్‌రెడ్డి ఫైర్‌.. రాజ్యాంగంలో రాసి ఉందా? అంటూ..  | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌పై కిషన్‌రెడ్డి ఫైర్‌.. రాజ్యాంగంలో రాసి ఉందా? అంటూ.. 

Published Sun, Apr 16 2023 7:43 PM

Kishan Reddy Serious Comments On CM KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సీరియస్‌ కామెంట్స్‌ చేశారు. సింగరేణి విషయంలో ఉద్యోగులను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలోనూ నిరసనలు తెలిపారని ఫైరయ్యారు. ప్రైవేటీకరణ వద్దంటూనే స్టీల్‌ప్లాంట్‌ విషయంలో చేస్తున్నదేమిటని ప్రశ్నించారు. 

కాగా, కిషన్‌రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ తెలంగాణలో పాలనను గాలికి వదిలేసి బీఆర్‌ఎస్‌ పేరుతో కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. తెలంగాణలో అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. ఒక్క పరిశ్రమనైనా తెరిపించారా? కేసీఆర్‌ చెప్పాలి. వందరోజుల్లో నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ తెరిపిస్తామని హామీ ఇచ్చారు. తొమ్మిదేళ్లు అవుతున్నా నిజాం షుగర్స్‌కు సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు ఎందుకు? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌కు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా? అని నిలదీశారు.

ముఖ్యమంత్రికి ఇఫ్తార్‌ విందుకు వెళ్లడానికి సమయం ఉంటుంది కానీ.. భద్రాచలానికి మాత్రం రారు. భద్రాచలం సీతారాముల కల్యాణం సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించే సంప్రదాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎందుకు రాలేదు?. అవినీతిపై ఆరోపణలు వస్తే దర్యాప్తు జరపవద్దని రాజ్యాంగంలో రాసి ఉందా? అన్ని ప్రశ్నల వర్షం కురిపించారు. చట్టం తనపని చేసుకుంటూ పోతుంది అందులో ఎవరి జోక్యం ఉండదు అని స్పష్టం చేశారు. కేసీఆర్‌ వైఫల్యాల నుంచి తెలంగాణ ప్రజలను పక్కదారి పట్టించేందుకు కల్వకుంట్ల కుటుంబం ఎత్తుగడలు వేస్తోంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

Advertisement
Advertisement