కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు | KCR Key Comments On Kaleshwaram Project In Meeting With Karimnagar Leaders, Details Inside - Sakshi
Sakshi News home page

కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు

Mar 3 2024 6:45 PM | Updated on Mar 3 2024 6:54 PM

Kcr Key Comments On Kaleshwaram Project - Sakshi

కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రాజెక్టుల్లో సమస్యలు రావడం సహజం..

సాక్షి, హైదరాబాద్‌: కరీంనగర్‌ పార్లమెంటు స్థానంలో బీఆర్‌ఎస్‌ గెలవబోతోందని.. ఈ నెల 12న కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్‌ కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహించే బహిరంగ సభకు ఏర్పాట్లు చేయాలని మాజీ సీఎం కేసీఆర్‌  అన్నారు. తెలంగాణ భవన్‌లో కరీంనగర్‌ నియోజకవర్గ నేతలతో ఆయన సమావేశమయ్యారు.  లోక్‌సభ ఎన్నికలకు పార్టీ కార్యాచరణ, అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్‌ చర్చించారు.

ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ అతికొద్ది రోజుల్లోనే కాంగ్రెస్‌ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందన్నారు. రైతులు రోడ్లు ఎక్కే పరిస్థితి తెచ్చారన్న కేసీఆర్‌.. బీఆర్‌ఎస్‌తో మేలు జరుగుతుందనే చర్చ ప్రజల్లో మొదలైందన్నారు. అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్‌ పట్టించుకోవద్దని.. నేతలంతా ఐక్యంగా పనిచేయాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

ప్రజలకు కొద్ది రోజుల్లోనే యాదికొస్తాం..
ఎల్ఆర్ఎస్ గతంలో మనం ప్రకటిస్తే ప్రజల రక్తం పీల్చుతున్నామంటూ కామెంట్ చేసినోళ్లు.. నేడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అదే ఎల్ఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. వాళ్ల కుంపటి వాళ్లు సర్దుకోవడానికి  టైం సరిపోతుంది. ప్రజలకు కొద్ది రోజుల్లోనే మనం కచ్చితంగా యాదికొస్తాం. బీఆర్ఎస్‌కు గెలుపు, ఓటములు కొత్త కాదు. కుంగి పోయేది...పొంగి పోయేది ఏమీ లేదంటూ కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.

మొత్తం పళ్లు  పీకేసుకోలేం కదా!
కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రాజెక్టుల్లో సమస్యలు రావడం సహజం.. మిడ్‌మానేరులో సమస్యలు వస్తే వెంటనే మరమ్మతులు చేశాం. సమస్య వస్తే ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించాలి. ఒక్క పన్ను పాడైతే చికిత్స తీసుకుంటాం.. మొత్తం పళ్లు  పీకేసుకోలేం కదా’’ అంటూ వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి: ఇద్దరు బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థులు ఖరారు 

Advertisement
 
Advertisement
Advertisement