రైతులకు బేడీలు వేసిన ఘనత చంద్రబాబుదే

Kannababu Fires On Chandrababu - Sakshi

ఉచిత విద్యుత్‌ కోసం పోరాడి సాధించావా? 

వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మండిపాటు

సాక్షి, అమరావతి: తన పాలనలో విద్యుత్‌ బిల్లులు చెల్లించని రైతులకు బేడీలు వేసి అరెస్టు చేయించిన ఘనత ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుదేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి చంద్రబాబు ఇవాళ ఉచిత విద్యుత్‌ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు..

► ఉచిత విద్యుత్‌ అంటేనే వైఎస్సార్‌ గుర్తుకు వస్తారు. ఉచిత విద్యుత్‌ ఇస్తే తీగలపై బట్టలు ఆరేసుకోవాలని చంద్రబాబు ఎద్దేవా చేశారు. అలాంటిది ఉచిత విద్యుత్‌ను పోరాటాల ద్వారా సాధించుకున్నామని చంద్రబాబు పచ్చి అబద్ధం చెప్పడం చూసి జనం నవ్వుకుంటున్నారు.
► విద్యుత్‌ సంస్కరణలకు ఆద్యుడినని అని చెప్పుకునే చంద్రబాబు ఆ పేరుతో ఎన్ని దాష్టికాలు, అరాచకాలు  చేశారు? బిల్లులు చెల్లించని రైతులకు నాడు తెలంగాణలో బేడీలు వేసి వ్యాన్‌లు ఎక్కించారా? లేదా? కాల్దరిలో, బషీర్‌బాగ్‌లో కాల్పులు ఎందుకు జరిగాయి? చంద్రబాబు ఇవన్నీ మరచిపోయి ఇప్పుడు మొసలి కన్నీరు కారిస్తే ప్రజలు నమ్ముతారా? సంస్కరణల పేరుతో విద్యుత్‌ రంగాన్ని 2004కు ముందు చంద్రబాబు అమ్మేయాలనుకున్నది నిజం కాదా?
► జగన్‌కు కుట్రలు కుతంత్రాలు తెలియవు. విశ్వసనీయతతో కూడిన రాజకీయాలే తెలుసు. మా పార్టీకి దేవుడులాంటి వైఎస్సార్‌ ప్రవేశ పెట్టిన పథకం ఉచిత విద్యుత్‌. ఇది మరో 30 ఏళ్లు కొనసాగడానికి వీలుగా శాశ్వతంగా రైతులకు మేలు జరిగేలా జగన్‌ ప్రభుత్వం ఏర్పాటు చేస్తూంటే.. టీడీపీని పట్టించుకునే వారు ఉండరనే భయంతో చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు.  

పత్తి రైతులకు సమస్య లేకుండా చూస్తాం
వచ్చే సీజన్‌లో పత్తి రైతులు ఇబ్బంది పడకుండా తమ దిగుబడులు స్వేచ్ఛగా అమ్ముకునేలా చూస్తామని  మంత్రి  కన్నబాబు చెప్పారు. ఏపీలో పండిన పత్తిని స్వరాష్ట్రంలోనే అమ్ముకునేలా చూడాలని కోరుతూ గుంటూరు ఎమ్మెల్యే మద్దాల గిరి నేతృత్వంలో ఏపీ పత్తి రైతుల అసోసియేషన్‌ ప్రతినిధులు విజయవాడలో మంత్రిని కలిసిన సందర్భంగా ఆయన ఈ హామీ ఇచ్చారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top