చంద్రబాబు పనైపోయింది 

Kakani Govardhan Reddy Fires On Chandrababu - Sakshi

అసెంబ్లీలో చర్చకు రాకుండా రాద్ధాంతం చేయడం సిగ్గుచేటు 

మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఫైర్‌  

నెల్లూరు (సెంట్రల్‌): ఈ అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ ఎమ్మెల్యేల తీరు చూస్తే చంద్రబాబు పనైపోయిందని స్పష్టంగా తెలుస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు. ఆయన శనివారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాల్లో కనీసం ప్రజా సమస్యల పైనయినా టీడీపీ ఎమ్మెల్యేలు చర్చకు వస్తారని ఆశించామని, కానీ ఏదో ఒక విధంగా గొడవ చేసి సభను అడ్డుకోవడం సిగ్గుచేటని అన్నారు.

ఇలాగైతే వారం కాదు.. రెండు వారాలు సభ పెట్టినా ఏం లాభమని మండిపడ్డారు. మూడు రాజధానులు, సంక్షేమ పథకాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో గణాంకాలతో సహా వివరించారన్నారు. ఏ సమస్య పైనయినా చర్చకు సిద్ధమని ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పినా టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు డైరెక్షన్‌లో మూర్ఖుల మాదిరి సభను అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

జన్మభూమి కమిటీలలాగా దోచుకోవడం లేకుండా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో అనేక సంక్షేమ పథకాలతో నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.1.70 లక్షల కోట్లు వేశారని తెలిపారు. లక్షల మందికి ఉద్యోగాలిచ్చారని చెప్పారు. ఇటువంటి పథకాల గురించి ఏనాడైనా చంద్రబాబు ఆలోచన చేశారా అని ప్రశ్నించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top