కడప కార్పొరేషన్‌లో హైడ్రామా.. తెరుచుకోని తలుపులు | High Drama At Kadapa Corporation Council Meeting Updates And News Video Inside | Sakshi
Sakshi News home page

కడప కార్పొరేషన్‌లో హైడ్రామా.. తెరుచుకోని తలుపులు

Jun 20 2025 8:00 AM | Updated on Jun 20 2025 10:19 AM

Kadapa Corporation Council Meeting Updates

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: దాదాపు ఆరు మాసాల తర్వాత ఇవాళ జరుగుతున్న నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గత రెండు నెలలుగా మీటింగ్ హాలుకు అధికారులు తాళం వేశారు. చివరికి ఇవాళ ఉదయం 11గంటలకు పాలకవర్గ సమావేశం ఉన్నా కానీ తాళం తీయలేదు. కుర్చీ కోసం.. కడప ఎమ్మెల్యే దొడ్డి దారిన కుర్చీ వేయించుకుని, దానికి బోల్టులు కూడా బిగించారనే ఆరోపణలు ఉన్నాయి.

మీటింగ్ హాల్ తలుపులు తీస్తేనే అసలు విషయం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. నేడు మీటింగ్ ఉన్నా ఇంతవరకూ తాళం తీయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు ఎమ్మెల్యేకు అనుకూలంగా నిబంధనలను కాలరాస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. కౌన్సిల్‌ హాలులో మేయర్‌తో సమానంగా తనకు వేదికపై కుర్చీ వేయలేదన్న కారణంతో.. గత రెండు సర్వసభ్య సమావేశాల్లో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆర్‌.మాధవిరెడ్డి తన అనుచరులతో ప్రవేశించి నానా రచ్చ చేసిన సంగతి తెలిసిందే.

తనకు లేని కుర్చీ.. మేయర్‌కు కూడా ఉండకూడదని భీష్మించుకుని.. మేయర్‌ సురేష్‌ బాబుపై అనర్హత వేటు వేయించాలని ఆమె చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. పురపాలక శాఖ కార్యదర్శి ఏకపక్షంగా జారీ చేసిన ఉత్తర్వులపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్టేటస్‌ కో విధించింది. మళ్లీ విచారణ చేసి మేయర్‌ వాదన వినాలని కోర్టు ఇచ్చిన ఆదేశాలను పురపాలక అధికారులు పెడచెవిన పెట్టి పాత పద్ధతిలోనే విచారణ చేసి.. ఈనెల 20వ తేదీన సర్వసభ్య సమావేశం కంటే ముందే మళ్లీ అనర్హత వేటు వేయాలని పన్నిన కుయుక్తులు న్యాయస్థానం ముందు ఫలించలేదు.

19వ తేదీ వరకూ మేయర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని యథాతథ స్థితి కొనసాగించాలని కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో.. ఈనెల 20వ తేదీన మేయర్‌ సురేష్‌బాబు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరగడం తథ్యమని తేలిపోయింది. 

మేయర్‌ కోరినా కౌన్సిల్‌ హాలు తలుపులు ఎందుకు తెరవలేదో.. 
మేయర్‌ ఆదేశాల మేరకు నడుచుకోవాల్సిన కమిషనర్‌.. అందుకు విరుద్ధంగా వ్యవహరించి ఎక్స్‌ అఫిషియో సభ్యులైన కడప, కమలాపురం ఎమ్మెల్యేలకు మేయర్‌తో సమానంగా వేదికపై కుర్చీలు వేసినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. అందుకే కౌన్సిల్‌ హాలు తాళం చెవులను తన వద్ద ఉంచుకొని.. మేయర్‌ స్వయంగా కోరినా తలుపులు తెరవలేదని సమాచారం. దీంతో వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు కౌన్సిల్‌ హాలు తెరిచేలా ఆదేశాలివ్వాలని జాయింట్‌ కలెక్టర్‌ను కోరడంతోపాటు సమావేశంలోకి ఇతరులను ఎవ్వరినీ అనుమతించవద్దని, పటిష్ట భద్రత కల్పిపంచాలని జిల్లా ఎస్పీని కోరారు.

అంతేగాక 39 మంది వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు హైకోర్టును ఆశ్రయించి తమకు భద్రత కల్పించాలని విన్నవించారు. కార్పొరేటర్ల పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం నగరపాలక సర్వసభ్య సమావేశానికి పటిష్ట భద్రత కల్పించాలని, గతంలో జరిగిన పొరపాట్లు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగే సర్వసభ్య సమావేశపు హాలులో ఎమ్మెల్యేలకు వేదికపై కుర్చీలు వేసి ఉంటే.. మేయర్, వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు ఎలా స్పందిస్తారు.. కమిషనర్‌ ఎవరి ఆదేశాలతో.. ఎవరి మెప్పు కోసం ఈ పని చేశారు.. కమిషనర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్లు పట్టుబడతారు.. అనే ప్రశ్నలకు నేడు సమాధానం లభించబోతోంది. ఒకవేళ కుర్చీ వేయకపోతే ప్రభుత్వ విప్‌ ఆర్‌.మాధవిరెడ్డి వ్యవహార శైలి ఎలా ఉంటుందనేది కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.  

ఏం చేయాలన్నా న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిందే 
వైఎస్సార్‌సీపీ మేయర్, కార్పొరేటర్ల గోడు విని న్యాయస్థానం ఆదేశాలిచ్చినా.. వాటిని అమలు చేయాల్సింది మళ్లీ అధికారులే కావడంతో సమస్య మళ్లీ మొదటికొస్తోంది. సభ నిర్వహణకు, సభలో చేసిన తీర్మానాలను మినిట్స్‌ బుక్‌లో రాయించేందుకు, వాటిని అమలు చేసేందుకు, అభివృద్ధి పనులు చేసేందుకు ఇలా ప్రతి దానికి వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు, మేయర్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతోంది. గతంలో ఎన్నడూ ప్రతిపక్షంపై అధికార పక్షం ఇంతటి ఘర్షణ పూరిత వాతావరణం తీసుకురాలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement