
యువగళం పేరుతో జనాదరణకు దూరంగా.. పాదయాత్ర చేసుకుంటూ పోతున్న టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్కు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు షాక్ ఇచ్చారు.
సాక్షి, కృష్ణా జిల్లా: యువగళం పేరుతో జనాదరణకు దూరంగా.. పాదయాత్ర చేసుకుంటూ పోతున్న టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్కు కు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు షాక్ ఇచ్చారు. గన్నవరం నియోజకవర్గంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కలకలం సృష్టించాయి. బాపులపాడు మండలం రంగన్నగూడెంలో ఫ్యూచర్ సీఎం.. జూ.ఎన్టీఆర్ అంటూ ఫ్లైక్సీలు ఏర్పాటు చేశారు.
కాగా, తమకు బలం ఉందని చెప్పుకునే ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో టీడీపీ సత్తా ఏమిటో తేలిపోయింది. అభ్యర్థులు లేకపోవడం, ఉన్న వారి మధ్య గొడవలతో పార్టీ పరిస్థితి దయనీయంగా ఉంది. యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ సినిమా డైలాగ్లను వల్లె వేస్తున్నా టీడీపీలో చాలా నియోజకవర్గాలకు అభ్యర్థులే లేకపోవడమే అసలు విషయాన్ని తేటతెల్లం చేస్తోంది. ఉన్న నేతలు కూడా చంద్రబాబును లెక్క చేయడం లేదు. లోకేశ్నైతే అసలు పట్టించుకోవడమే లేదు.
ఆ పార్టీ తరఫున గెలిచిన ముగ్గురు ఎంపీల్లో ఇద్దరు యువగళం యాత్రను బహిష్కరించడమే ఇందుకు ఉదాహరణ. లోకేశ్ తమ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసినా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, విజయవాడ ఎంపీ కేశినేని నాని అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు.