సాక్షి, అనకాపల్లి: ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ పాలనలో కూటమి నేతల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కూటమి పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలే.. పాలకుల అరాచకాలను బయటపెడుతున్నారు. తాజాగా బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అక్రమ మైనింగ్పై జనసేన నేత వంశీ వీడియో విడుదల చేశారు. ఈ క్రమంలో అక్రమ మైనింగ్ చేస్తున్న వారిని అరెస్ట్ చేయాలని వంశీ డిమాండ్ చేశారు.
వివరాల మేరకు.. అనకాపల్లి జిల్లాలోని రాంబల్లిలో ఎంపీ సీఎం రమేష్ అక్రమ మైనింగ్పై జనసేన నేత వంశీ వీడియో విడుదల చేశారు. మైనింగ్ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి అర్ధరాత్రి వీడియో విడుదల చేశారు. ఈ సందర్బంగా వంశీ మాట్లాడుతూ..‘అక్రమ మైనింగ్ను అడ్డుకుంటే లారీలతో తొక్కి చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఎంపీ సీఎం రమేష్ పేరు చెప్పి తవ్వకాలు జరుగుతున్నాయి. అక్రమ మైనింగ్ దగ్గరకు వచ్చిన నన్ను చంపాలనుకుంటున్నారు అని ఆరోపించారు.
అలాగే, అక్రమ మైనింగ్ జరగలేదని పైకి చెబుతున్నారు. కానీ, కూటమి ప్రభుత్వ హయాంలోనే పంచదార్ల కొండపై మైనింగ్ జరుగుతుంది. నెంబర్ ప్లేట్లు లేని లారీలతో గ్రావెల్ తరలిస్తున్నారు. అక్రమ మైనింగ్ పాల్పడే వారిని అరెస్టు చేసి జైలుకు పంపాలి’ అని డిమాండ్ చేశారు.


