‘చంద్రబాబు.. మీరు ఏనాడైనా ప్రాజెక్టుల గురించి పట్టించుకున్నారా?’ | Former Minister Ambati Rambabu Takes On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు.. మీరు ఏనాడైనా ప్రాజెక్టుల గురించి పట్టించుకున్నారా?’

Dec 31 2024 5:53 PM | Updated on Dec 31 2024 6:03 PM

Former Minister Ambati Rambabu Takes On Chandrababu Naidu

తాడేపల్లి : తన హయాంలో  ఏనాడు ప్రాజెక్టుల గురించి పట్టించుకున్న దాఖలాలు లేని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)..  ఇప్పుడు కొత్తగా గోదావరి-బనకచర్లని కూడా తనదే అంటూ ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu).

ఈరోజు(మంగళవారం) తాడేపల్లి నుంచి మీడియాతో మాట్లాడిన అంబటి.. నదుల్లో ప్రవహించే ప్రతి నీటిబొట్టు భూమి మీదుకు రావాలని దివంగత మహానేత వైఎస్సార్‌ ఆశించారని, అందుకే పెద్ద ఎత్తున జలయజ్ఝాన్ని(Jalayagnam) ప్రారంభించారన్నారు. అటువంటింది ఇప్పుడు కొత్తగా గోదావరి-బనకచర్లని కూడా తనదే అంటూ చంద్రబాబు ప్రచారం  చేసుకుంటున్నారన్నారు. 

ఈ ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. ఈ ప్రాజెక్టును మూడు దశల్లో పూర్తి చేయాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) ప్లాన్‌ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా అంబటి గుర్తు చేశారు. కృష్ణా నదిలో నీరు సరిపడా రాకపోయినా గోదావరి నీటితో పల్నాడు, రాయలసీమకి ఉపయోగపడుతుందని జగన్ ప్రణాళిక సిద్ధం చేశారన్నారు. దీనికి డీపిఅర్ కూడా జగన్ ప్రభుత్వమే తయారు చేసి కేంద్రానికి పంపిందన్నారు. కానీ చంద్రబాబు తానే చేసినట్టుగా ఏమాత్రం సిగ్గు పడకుండా చెప్పుకుంటున్నారని, చివరికి ఈ ప్రాజెక్టును కూడా ప్రయివేటు పరం చేయబోతున్నారని విమర్శించారు అంబటి.

చివరికి సాగునీటి ప్రాజెక్టులను కూడా ప్రయివేటు పరం చేయటాన్ని ఇప్పుడే చూస్తున్నామన్నారు. ఇది జల హారతి కాదని, చంద్రబాబు హారతి అని అంబటి ఎద్దేవా చేశారు.  చంద్రబాబు ఇప్పటికే పోర్టులు మెడికల్ కాలేజీలు, రోడ్లను ప్రయివేటు పరం చేశారన్నారు.

 

రౌడీయిజం అంతా చంద్రబాబు మనుషులే చేస్తున్నారు
రాష్ట్రంలో రౌడీయిజం అంతా చంద్రబాబు మనుషులే చేస్తున్నారన్నారు. కొందరు పోలీసులు కూడా రౌడీయిజం చేస్తున్నారన్నారని అంబటి మండిపడ్డారు. ఈ ప్రభుత్వం ఎంతోకాలం నిలవదనే గుర్తు పెట్టుకోవాలన్నారు. చంద్రబాబు ధనిక ముఖ్యమంత్రి అని, రెండు ఎకరాల నుండి వేల కోట్లు ఎలా సంపాదించాడని ప్రశ్నించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ప్రజా ఉద్యమాలు త్వరలో రావడం తథ్యమన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement