శిల్పా రవిని గెలిపించండి | Film actor Allu Arjun supports YSRCP candidate Nandyala | Sakshi
Sakshi News home page

శిల్పా రవిని గెలిపించండి

May 12 2024 5:39 AM | Updated on May 15 2024 11:59 AM

Film actor Allu Arjun supports YSRCP candidate Nandyala

నంద్యాల వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి సినీ నటుడు అల్లు అర్జున్‌ మద్దతు

బొమ్మలసత్రం: నంద్యాల వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డిని మంచి మెజారిటీతో గెలిపించాలని ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్‌ పిలుపునిచ్చారు. శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డికి మద్దతు తెలిపేందుకు అల్లు అర్జున్‌ తన భార్య స్నేహారెడ్డితో కలిసి శనివారం నంద్యాల వచ్చారు. ఆయనకు పట్టణ శివారులోని ఆటోనగర్‌ వద్ద అభిమానులు భారీ గజమాలలతో ఘన స్వాగతం పలికారు. నంద్యాలలోని శిల్పా రవి నివాసానికి చేరుకుని వేలాదిగా తరలివచ్చిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులకు చాలాసేపు అభివాదం చేశారు. 

శిల్పా రవి నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అల్లు అర్జున్‌ మాట్లాడారు. ‘శిల్పా రవి నాకు మంచి మిత్రుడు. ఇన్నేళ్ల మా ఇద్దరి స్నేహంలో నన్ను ఎన్నికల ప్రచారం కోసం రావాలని ఏనాడూ రవి కోరలేదు. నేనే శిల్పా రవి కోసం ఏమైనా చేయా­లనే ఆలోచనతో ఇక్కడికి వచ్చాను. రవి మంచి మనసు, ఆయన కుటుంబ సభ్యులతో ఉన్న సాన్నిహిత్యమే నన్ను ఇంత దూరం వచ్చేలా చేసింది. 

నా మనసుకు నచ్చిన స్నేహితులు ఏ ఫీల్డ్‌లో ఉన్నా వారి అభివృద్ధిని కోరుకుంటాను. నాకు పార్టీలతో సంబంధం లేదు. శిల్పా రవి మంచి మెజారిటీతో గెలవాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రతి ఒక్కరూ శిల్పా రవికి ఓటు వేసి మంచి మెజారిటీతో గెలిపించా­లని కోరుతున్నాను...’ అని అల్లు అర్జున్‌ పేర్కొ­న్నారు. శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి మాట్లాడుతూ ఎంతో బిజీ షెడ్యూల్‌ ఉన్నప్పటికీ తనను గుర్తుంచుకుని అల్లు అర్జున్‌ ఇంతదూరం రావడం సంతోషంగా ఉందన్నారు. 

అల్లు అర్జున్, శిల్పా రవిపై కేసు నమోదు 
ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని  అల్లు అర్జున్, శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డిలపై పోలీసులు కేసు నమోదుచేశారు. శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డిని కలిసేందుకు అల్లు అర్జున్‌ హైదరాబాద్‌ నుంచి శనివారం నంద్యాలకు వచ్చారు. ఆయన వస్తున్నాడని తెలిసి ప్రజలు భారీ సంఖ్యలో ఎమ్యెల్యే శిల్పా రవి నివాసం వద్దకు తరలివచ్చారు.

 జనం గూమికూడేందుకు అనుమతి తీసుకోలేదని ఎమ్యెల్యే శిల్పా రవి, అల్లు అర్జున్‌పై ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి నంద్యాల టూ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారిపై 188 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసినట్లు సీఐ రాజారెడ్డి తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement