ఎన్నికలకు రాష్ట్ర పార్టీని సన్నద్ధం చేసేలా.. | Sakshi
Sakshi News home page

ఎన్నికలకు రాష్ట్ర పార్టీని సన్నద్ధం చేసేలా..

Published Thu, Mar 28 2024 1:43 AM

Field visits of BJP leaders from today - Sakshi

నేటి నుంచి బీజేపీ ముఖ్య నేతల క్షేత్రస్థాయి పర్యటనలు

లోక్‌సభ ఎన్నికల్లో సమన్వయంపై సునీల్‌ బన్సల్‌ తరుణ్‌చుగ్, శివప్రకాశ్, ఇతర నేతల సమీక్ష  

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికలకు రాష్ట్ర పార్టీని పూర్తిస్థాయిలో సన్నద్ధం చేయడంలో భాగంగా బీజేపీ జాతీయ నాయకులు తెలంగాణకు రాను న్నారు. ముఖ్యంగా పార్టీలో నాయకులు, కార్యక ర్తల మధ్య మెరుగైన సమన్వయ సాధన కోసం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జిలు సునీల్‌ బన్సల్, తరుణ్‌ చుగ్, సంస్థాగత సహ ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్, ఇతర నేతలు సమీక్షించనున్నారు. గురువారం నుంచి వరుసగా రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్ల పరిధిలో ఎక్కడికక్కడ సమన్వయ సమావేశాలు నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా పార్లమెంట్‌ నియోజకవర్గాల ఎలక్షన్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీలతో భేటీ అయ్యి ఇప్పటి వరకు చేపట్టిన, చేపడుతున్న కార్యకలాపాలను సమీక్షిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లోని లోక్‌సభ నియోజకవర్గాల్లో మండల పార్టీ అధ్యక్షులు, ఆపై స్థాయి నాయకులతో, పట్టణ ప్రాంతాల్లోని స్థానా ల్లో డివిజన్, ఆపై స్థాయి నాయకులతో సమావేశమై ఆయా అంశాలపై సమీక్ష నిర్వహి స్తారు. గురువారం శివప్రకాశ్‌ నాగర్‌కర్నూల్, హైదరాబాద్‌ ఎంపీ స్థానాలో పర్యటించనుండగా, మిగతా నేతలకు కూడా రెండేసి లోక్‌సభ స్థానాలను కేటాయించినట్టు తెలిసింది.

సునీల్‌ బన్సల్, ఇతర నేతలు కూడా ఒకట్రెండు రోజుల్లో రాష్ట్రాన్ని సందర్శించనున్నట్టు తెలుస్తోంది. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్‌లకు కూడా కొన్ని ఎంపీ సీట్లలో నాయకుల మధ్య సమన్వయం సాధించే బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. పార్టీ జాతీయ నాయకులతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) చంద్రశేఖర్‌ తివారీ కూడా ఈ సమీక్ష సమావేశాల్లో పాలుపంచుకోనున్నారు.

ఈ సందర్భంగా పోలింగ్‌ బూత్‌ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనం పొందిన వారిని, ముఖ్యంగా మహిళలు, ఇతర వర్గాల వారిని కలుసుకుని మద్దతును కూడగట్టాలని నిర్ణయించారు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎన్నికల కార్యాలయాలు ప్రారంభించడం, ఎన్నికల మేనేజ్‌మెంట్‌ కమిటీల భేటీల నిర్వహణ, ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేయడంపై దృష్టి పెట్టనున్నారు. 

Advertisement
Advertisement