బీఆర్‌ఎస్‌కు తాటికొండ రాజయ్య గుడ్‌బై | Ex MLA Thatikonda Rajaiah Resign For BRS Party | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. తాటికొండ రాజయ్య గుడ్‌బై

Feb 3 2024 10:12 AM | Updated on Feb 3 2024 12:18 PM

Ex MLA Thatikonda rajaiah Resign For BRS party - Sakshi

సాక్షి, వరంగల్‌: లోక్‌సభ ఎన్నికల ముందు బీఆర్‌ఎస్‌కు భారీ షాక్‌ తగిలింది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఢీలా పడిన గులాబీ పార్టీకి.. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గుడ్‌బై చెప్పారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజయ్య శనివారం రాజీనామా చేశారు. అయితే వరంగల్ పార్లమెంట్ సీటు ఆశించిన రాజయ్యకు.. పార్టీ అధిష్టానం నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. 

కాగా జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే అయిన తాటికొండ రాజయ్యకు.. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ టికెట్‌ నిరాకరించింది. రాజయ్యకు ఎంపీ అవకాశం ఇస్తామని హామీ ఇచ్చి.. మాజీ ఎమ్మెల్యే కడియం శ్రీహారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఫాం అందించింది. ఈ ఎన్నికల్లో కడియం శ్రీహరి విజయం కూడా సాధించారు.

ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ లోక్‌సభ ఎన్నికలపై ఫోకస్‌ పెట్టింది. ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించింది. అయితే ముందుగా మాటిచ్చిన పార్లమెంట్‌ స్థానంపై బీఆర్‌ఎస్‌ అధిష్టానం నుంచి ఎలాంటి భరోసా రాకపోవడంతో రాజయ్య అసంతృప్తికి లోనైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. వచ్చే రోజుల్లో కాంగ్రెస్‌లో చేరి ఎంపీగా పోటీ చేసే ఛాన్స్‌ ఉంది. 

ఇక తెలంగాణ ఏర్పడిన తర్వాత వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్‌ కొట్టాలని చూసింది. కానీ ఎన్నికల ఫలితాలు బీఆర్‌ఎస్‌కు ఊహించని షాక్‌ ఇవ్వడంతో  కేవలం ప్రతిపక్షానికి పరిమితమైంది. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో అయినా అత్యధిక సీట్లు గెలుచుకోవాలని  యత్నిస్తోంది. ఇందుకు తగ్గట్లే అధికార కాంగ్రెస్వి‌పై విమర్శలు గుప్పిస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ సమయంలో మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య పార్టీని వీడటం.. ఆ పార్టీకి షాక్‌గానే చెప్పవచ్చు.
చదవండి: కాంగ్రెస్‌ ఎంపీ టికెట్‌ రేసు.. ఆశావహుల్లో టెన్షన్‌!

Advertisement
 
Advertisement
Advertisement