సాక్షి, హైదరాబాద్: తమ పాలనలో కేంద్రం సహకరించకపోయినా అభివృద్ధి చేశామని.. బీఆర్ఎస్ పాలనలో నిర్మించిన కట్టడాలను చూసి ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా ప్రశంసిస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నాలుగేళ్లలోనే ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టామన్న కేటీఆర్.. సీఎం రేవంత్రెడ్డి కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏం తెచ్చారంటూ ప్రశ్నించారు.
‘‘రాష్ట్ర అప్పులపై సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. సీఎం రేవంత్ తీరుతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుంది. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర ఆదాయం నెలకు రూ.18,500 కోట్లు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై సీఎం రేవంత్ పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి అరాచక పాలన చేస్తున్నారు. రుణమాఫీ పేరుతో రైతులకు సీఎం రేవంత్ రూ.29 వేల కోట్లు ఎగ్గొట్టారు. అబద్దాలు చెప్పడం సీఎం రేవంత్ జన్మహక్కు’’ అంటూ కేటీఆర్ దుయ్యబట్టారు.
‘‘సీఎం రేవంత్, ఆయన సోదరులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. డబ్బులు లేవంటూనే రూ.200 కోట్లతో అందాల పోటీలు నిర్వహించారు. సీఎం రేవంత్ రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. సీఎం రేవంత్తో చర్చకు నేను సిద్ధం. టాపిక్.. ప్లేస్, డేట్.. టైమ్ రేవంత్ చెప్పాలి. సవాల్ విసిరి పారిపోయే అలవాటు సీఎం రేవంత్దే. మీ తప్పులను బయటపెట్టకపోతే రాజకీయాలను నుంచి తప్పుకుంటా. ఉద్యోగాలు, రైతు డిక్లరేషన్.. దేనిపైనైనా చర్చకు రెడీ’’ అంటూ కేటీఆర్ సవాల్ విసిరారు.


