లోకేష్‌కు గుడివాడలో పోటీ చేసే దమ్ముందా?.. పేర్ని నాని సవాల్‌ | Ex-Minister Perni Nani Comments On Chandrababu And Lokesh - Sakshi
Sakshi News home page

లోకేష్‌కు గుడివాడలో పోటీ చేసే దమ్ముందా?.. పేర్ని నాని సవాల్‌

Aug 23 2023 4:01 PM | Updated on Aug 23 2023 4:35 PM

Ex Minister Perni Nani Comments On Chandrababu And Lokesh - Sakshi

నారా లోకేష్‌కు గుడివాడలో పోటీ చేసే దమ్ముందా? అంటూ పేర్ని నాని సవాల్‌ విసిరారు.

సాక్షి, అమరావతి: నారా లోకేష్‌కు గుడివాడలో పోటీ చేసే దమ్ముందా? అంటూ పేర్ని నాని సవాల్‌ విసిరారు. గుడివాడ, గన్నవరంలో పోటీకి టీడీపీ అభ్యర్థులు లేరన్న ఆయన.. సూర్యుడు అస్తమించాక లోకేష్‌ యాత్ర ప్రారంభం అవుతుందని ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అసలు లోకేష్ ఎవరితో మాట్లాడతారు? ఏం చర్చిస్తారు?. పాదయాత్ర పగటిపూట చేస్తే జనం ఛీ కొడతారని, జనం నిద్ర పోయాక అర్ధరాత్రి చేస్తున్నారు. రోజుకు వెయ్యి రూపాయల చొప్పున డబ్బులు ఇచ్చి జనాన్ని రప్పించుకుంటున్నారు’’ అని మండిపడ్డారు.

లోకేష్‌ను సంస్కారం లేని వ్యక్తిగా మార్చి చంద్రబాబు జనం మీదకి వదిలాడు. జగన్‌ని బూతులు తిట్టటానికే లోకేష్ యాత్ర చేస్తున్నారు. వైఎస్సార్‌, జగన్‌ల పాదయాత్ర ఎలా చేశారో వీడియోలు చూస్తే ఎలా పాదయాత్ర చేయాలో తెలుస్తుంది. తండ్రి గురించి చెప్పుకోలేని దుస్థితిలో లోకేష్ ఉన్నాడు. పేదలకు ఇళ్లు కట్టిస్తాననీ, రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తాననీ, విద్యారంగంలో సమూల మార్పులు చేస్తాననీ జగన్ చెప్పుకుని ఓట్లు అడిగారు. కానీ లోకేష్ బూతులతో పాదయాత్ర చేస్తున్నారు’’ అంటూ దుయ్యబట్టారు.

‘‘వంశీ టీడీపీలో ఉన్నప్పుడు కూడా పశువుల డాక్టరే. అప్పుడు మనుషుల డాక్టర్ అయ్యాడా?. సిగ్గుశరం లేదా మీకు?. 2004, 2009లో టీడీపీ తరపున పోటీ చేసినప్పుడు కొడాలి నాని సాఫ్ట్‌వేర్ ఇంజినీరా?. ఇప్పుడు మాత్రం లారీ క్లీనర్, కప్పులు‌ కడిగే వాడా?. ఆ లారీ క్లీనర్‌ని చూస్తే చంద్రబాబు, లోకేష్‌లకు ప్యాంట్లు తడుస్తున్నాయి. ఆ లారీ క్లీనర్లు, కప్పులు కడిగేవాళ్ల ఓట్లు అవసరం లేదా?. కొడాలి నాని చంద్రయాన్ సైంటిస్టు అని చెప్పుకోలేదే?’’ అని పేర్ని నాని మండిపడ్డారు.
చదవండి: లోకేష్‌పై డీజీపీకి ఫిర్యాదు చేసిన పోసాని

‘‘జగన్ మీద పోటీ చేసే దమ్ము లేకనే దత్తపుత్రుడుని తెచ్చుకున్నారు. జగన్ ఇచ్చే పథకాలను తానూ ఇస్తానని చంద్రబాబు చెప్తున్నారు. అలాంటప్పుడు జగన్ ఉండగా, ఇక చంద్రబాబు ఎందుకు?. పండుగల‌ సమయంలో వారి హెరిటేజ్‌లోని సరుకులు అమ్ముకోవటానికే రకరకాల పేర్లతో పథకాలు పెట్టారు. అన్నా క్యాంటీన్ల పేరుతో  దోపిడీ చేశారు. అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని అన్నా క్యాంటీన్లు పెట్టారో లెక్క చెప్పగలరా?. బెజవాడకు అటు గన్నవరంలో వంశీ గెలిస్తే ఇటు లోకేష్ ఓడిపోయాడు. అలాంటి లోకేష్ కూడా వంశీపై ఆరోపణలు చేస్తున్నారు. ఇకనైనానా తప్పుడు సంస్కారం, బూతులు తిట్టటం మానుకోవాలి’’ అని పేర్ని నాని హితవు పలికారు.

‘‘మచిలీపట్నంలో పోర్టు నిర్మాణాన్ని టీడీపీ ఎలా అడ్డుకున్నదో జనం అందరికీ తెలుసు. ఆధారాలతో సహా లోకేష్ తో చర్చించటానికి నేను సిద్దం. దమ్ముంటే లోకేష్ చెప్తే నేను అక్కడకు వచ్చి చర్చిస్తా. నా సవాల్‌ని లోకేష్ తీసుకునే దమ్ముందా?. లోకేష్‌ని చూస్తే వారి పార్టీలోని వారే భయపడుతున్నారు’’ అని పేర్ని నాని వ్యాఖ్యానించారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement