
సాక్షి, చిత్తూరు: ఎల్లో మీడియాపై మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మండిపడ్డారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీవీ-5 తప్పుడు ఛానల్ అని.. అందుకే వైఎస్సార్సీపీ నిషేధించిందన్నారు. టీడీపీ ప్రయోజనాలు తప్ప, ప్రజల ప్రయోజనాలు పట్టని ఛానల్ అది అంటూ దుయ్యబట్టారు.
ఇవాళ మా ఇంటికి టీవీ-5 రిపోర్టర్ వచ్చారు. ఇంటికి వచ్చాడు కదా అని గౌరవించి కూర్చోబెట్టాను. అక్రమ లిక్కర్ కేసు గురించి అడిగితే కొన్ని విషయాలు మాట్లాడాను. కాని, నేను చెప్పని మాటలను చెప్పినట్టుగా ఆ ఛానల్ బ్రేకింగ్స్ వేసి నడిపించింది. నేను వెంటనే ఆ రిపోర్టర్కు ఫోన్ చేసి ఇది సరికాదని, అనని మాటలు అన్నట్టుగా చూపించడం భావ్యం కాదని వారిని హెచ్చరించాను. సరిచేయమని కోరాను.
..ఇప్పటివరకూ వారు స్పందించలేదు. సీనియర్ దళిత నాయకుడి మీద కనీస మర్యాదను పాటించకుండా, నా ప్రతిష్టకు భంగం కలిగించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాను. దీనిపై న్యాయ ప్రకారం ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నాను’’ అని నారాయణ స్వామి తెలిపారు.