సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం అరకొరగా పథకాలు అమలు చేసి అన్నీ ఇచ్చేశామని గొప్పలు చెప్పుకుంటోందని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం రూ.3.27 లక్షల కోట్ల అప్పులు చేసిందని తెలిపారు. రాష్ట్ర అప్పులపై కూటమి ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని అన్నారు.
హైదరాబాద్ ప్రెస్క్లబ్లో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఆర్బీఐ నుంచి తెచ్చింది అప్పుకాదా? తాత్కాలికంగా చేసిన అప్పు తిరిగి కట్టాల్సిన పనిలేదా? రాజధాని అమరావతి కోసం రూ.47,837 కోట్ల అప్పు చేశారు. కార్పొరేషన్ల పేరుతో వేల కోట్ల రూపాయల అప్పులు చేసింది వాస్తవం కాదా? ఏ రంగాన్నీ వదిలిపెట్టకుండా చంద్రబాబు నాయుడు విచ్చలవిడిగా అప్పులు తెచ్చారు’ అని చెప్పారు.
‘వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2024-25 సీఏసీ రిపోర్ట్ పై మాట్లాడారు. ఆయన మాట్లాడితే టీడీపీ నేతల్లో వణుకు ఎందుకు? సీఏసీ రిపోర్ట్ లోని అంశాలను ప్రస్తావించడమే తప్పు అన్నట్లుగా కూటమి నేతలు మాట్లాడుతున్నారు. కూటమి భాధ్యతను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తుచేశారు. టీడీపీ పుట్టిందే సినిమా బేస్ మీద. అందుకే ఎన్నికల హామీలు కూడా సినిమా టైటిల్స్ లా ఉన్నాయి.
రాష్ట్రంలో గ్యాస్ కొరతతో పేదలు ఇబ్బంది పడుతున్నారు. కూటమి ప్రభుత్వం హామీ మేరకు 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలి. 2024-25లో రూ.60 వేల కోట్లు అప్పు చేశామని ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించారు. సీఏజీ రిపోర్ట్ ప్రకారం రూ.80 వేల కోట్లకు పైగా అప్పు చేశారు’ అని అన్నారు.


