శ్రీకాకుళం: పంట పండితే కనీసం ధర ఇప్పించలేని దిక్కుమాలిన స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. పంటకు పండించేందుకు కావాల్సిన ఎరువు ఇప్పించలేని దయనీయ స్థితి ఇవాళ మన రాష్ట్రంలో నెలకొనడం నిజంగా సిగ్గుచేటన్నారు. కష్టకాలంలో రైతులకు ఆపన్నహస్తం అందించి మానవతను చాటుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడంపై ధర్మాన మీడియాతో మాట్లాడారు.
‘వెంటనే కొనుగోలు కేంద్రాలను తెరిచి మొక్కజొన్న రైతును ఆదుకోండి. కనీస మద్దతు ధర చెల్లింపునకు వెంటనే చర్యలు చేపట్టండి. కష్టకాలంలో రైతులకు ఆపన్నహస్తం అందించి మానవతను చాటుకోండి. పంటకు అవసరం అయిన యూరియా అందించడంలోనూ కూటమి ప్రభుత్వం విఫలమైంది. రైతులు యూరియాను బ్లాక్ మార్కెట్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. గిట్టుబాటు ధర లేక రైతులు కన్నీరు పెడుతున్నారు. ఎకరాకు 28 వేల రూపాయలు నష్టం వస్తుంది.
దళారీల వల్ల మొక్కజొన్న రైతు దోపిడీ గురవుతున్నాడు. మొక్కజొన్న క్వింటాకు రెండు వేల 400 రూపాయలు చెప్పున ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. మార్కెట్లో క్వింట 1500 రూపాయలకు దళారీలు కొనడంతో రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. పంట పండితే కనీసం ధర ఇప్పించలేని దిక్కుమాలిన స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. పంటకు పండించేందుకు కావాల్సిన ఎరువు ఇప్పించలేని దయనీయ స్థితి ఇవాళ మన రాష్ట్రంలో నెలకొన్నాయి. వెంటనే కొనుగోలు కేంద్రాల ద్వారా మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలని వైఎస్సార్సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం’ అని అన్నారు.


