సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్లో మహిళలపై జరుగుతున్న దారుణాలపై వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి మండిపడ్డారు. తాడేపల్లిలో లక్ష్మీపార్వతి మీడియా సమావేశంలో మాట్లాడారు. కూటమి అధికారంలోకి వచ్చాక మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని చెప్పారు. హహిళలపై ఎమ్మెల్యేలే అత్యాచారాలు చేస్తున్నారని ఆమె అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలాంటి వ్యక్తిని టీటీడీ ఛైర్మన్గా నియమించారో అందరికీ తెలుసని లక్ష్మీపార్వతి విమర్శించారు. వైఎస్సార్సీపీ హయాంలోనే మహిళలకు న్యాయం జరిగిందని ఆమె అన్నారు. చంద్రబాబు నాయుడు సిగ్గుమాలిన నాయకుడని ఆమె మండిపడ్డారు.
‘రాష్ట్రం అత్యాచారాల ఆంధ్రప్రదేశ్ గా మారిపోయింది. కొందరు ఎమ్మెల్యేలు కూడా మహిళలపై దారుణాలకు పాల్పడటం సిగ్గుచేటు. పాపాలను పంచుకోవటంలో జనసేన కూడా భాగం పంచుకుంటోంది. పోలీసులను పనికిమాలిన వారిగా మార్చేశారు. కిరణ్ రాయల్, అరవ శ్రీధర్, కోనేటి ఆదిమూలం, నసీర్ అహ్మద్, కూన రవికుమార్.. ఇలా చెప్పుకుంటే ఎంతోమంది మహిళలను వేధించారు.
దేవుడే లేడన్న చంద్రబాబు సీఎం అయ్యారు. పూజ దీపం దగ్గర సిగరెట్ ముట్టిస్తాడంటూ తన తండ్రి గురించి చెప్పిన పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. ఇలాంటి వారి చేతిలో రాష్ట్రం అధోగతి పాలవుతోంది. మహిళలకు అన్యాయం చేసిన వారు ఏమయ్యారో చరిత్ర చూస్తే తెలుస్తుంది. చంద్రబాబు మహిళలను అడ్డం పెట్టుకుని నీచ రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పుడు మేకతోలు కప్పుకుని స్తోత్రాలు మాట్లాడవద్దు.
టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడి వీడియోలు బయటకు వస్తే ఏం చర్యలు తీసుకున్నారు? ఒక మహిళ స్వయంగా లేఖ రాసినా చంద్రబాబు ఎందుకు పట్టించుకోలేదు? దేవునితో కూడా ఆటలు ఆడుకోవటం సరికాదు. జగన్ హయాంలో దిశ యాప్, దిశా పీఎస్ లు ఏర్పాటు చేసి మహిళలకు రక్షణ కల్పించారు. ఇలాంటి మేలు చేయటం చంద్రబాబు చరిత్రలో లేదు. ప్రజలు ఎంత అసహ్యించుకుంటున్నారో బయటకు వస్తే తెలుస్తుంది. ఆడపిల్లలను స్కూల్కి పంపాలన్నా కూడా ఇప్పుడు పేరెంట్స్ భయపడుతున్నారు.


