
సాక్షి, హైదరాబాద్: చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కావాలని ఢిల్లీలో దొంగ దీక్ష చేసిన కవిత రాష్ట్రంలో మహిళలకు 33 %సీట్లు ఇవ్వలేదని తండ్రిని ఎందుకు అడగట్లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ నిలదీశారు. లిక్కర్ కేసును దారి మళ్లించేందుకే కవిత దీక్ష చేశారని, మహిళా బిల్లును చించేసిన పార్టీలతో కలిసి వెళ్లారని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం మీడియాతో అరుణ మాట్లాడారు.
ఆదివాసీ మహిళను రాష్ట్రపతిగా పెడితే బీఆర్ఎస్ ఆమెకు వ్యతిరేకంగా ఓటు వేసిందని చెప్పారు. ఆర్థిక, రక్షణ, విదేశీ వ్యవహారాల శాఖలను మహిళలకిచ్చిన ఘనత మోదీదేనన్నారు. మహిళల మీద నగరం నడబొడ్డున అకృత్యాలు జరిగినా సీఎం కార్యాలయంలో పనిచేసే ఏ అధికారి మాట్లాడటం లేదని, కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న అధికారులందరికీ రాజకీయ పిచ్చి పట్టుకుందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థుల మీద అనేక ఆరోపణలు ఉన్నాయని, అయినా కేసీఆర్ వారినే ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించారని తెలిపారు. అభద్రతా భావంతోనే కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్న కేసీఆర్ గంప గోవర్ధన్ కోరిక మేరకే అని సమరి్థంచుకోవడం శోచనీయమన్నారు.