తనపై దాడి తర్వాత ఢిల్లీ సీఎం రేఖా గుప్తా రియాక్షన్‌ ఇదే! | Delhi CM Rekha Gupta Reacts After Attack During Jan Sunwai. | Sakshi
Sakshi News home page

తనపై దాడి తర్వాత ఢిల్లీ సీఎం రేఖా గుప్తా రియాక్షన్‌ ఇదే!

Aug 20 2025 6:41 PM | Updated on Aug 20 2025 7:43 PM

Delhi CM Rekha Gupta First Reaction After Attack

సాక్షి,న్యూఢిల్లీ: ‘ఈ దాడి నా మీద మాత్రమే కాదు..ప్రజాసేవ చేయాలనే నా నిబద్ధత మీద కూడా జరిగిన దాడి’ అంటూ ప్రజాదర్భార్‌లో ఓ వ్యక్తి తనపై దాడి చేసిన ఘటనపై ఢిల్లీ సీఎం రేఖాగుప్తా స్పందించారు.

ఈ దాడి నా మీద మాత్రమే కాదు, ప్రజాసేవ పట్ల ఉన్న నా నిబద్ధత మీద కూడా జరిగిన దాడి. ఇలాంటి ఘటనలు నా ఆత్మవిశ్వాసాన్ని, ప్రజల కోసం పనిచేయాలన్న సంకల్పాన్ని ఎప్పటికీ దెబ్బతీయలేవు. ఇప్పటికీ నేను బాగానే ఉన్నాను. త్వరలోనే మళ్లీ మీ మధ్య ఉంటాను. మరింత శక్తితో, మరింత అంకితభావంతో పనిచేస్తాను’అని ధీమా వ్యక్తం చేశారు.  

ఢిల్లీ సీఎం రేఖా గుప్తా బుధవారం ఉదయం జన్ సున్వాయి (ప్రజాదర్భార్‌) నిర్వహించారు. ఆ కార్యాక్రమంలో ఓ వ్యక్తి తన సమస్యను పరిష్కరించాలని కోరుతూ కొన్ని పేపర్లు సీఎం రేఖాగుప్తాకు అందించాడు. ఆ పేపర్లను సీఎం పరిశీలించే సమయంలో నిందితుడు ఆమెను ఓ   వస్తువుతో దాడి చేశాడు. కొందరు ప్రత్యక్ష సాక్షులు ఆమెను చెంపమీద కొట్టాడాని చెబుతున్నారు.

ఈ ఘటనలో సీఎం రేఖాగుప్తా తలకి గాయమైంది. అప్రమత్తమైన అధికారులు,వ్యక్తిగత సిబ్బంది ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో తనపై జరిగిన దాడి ఘటనపై రేఖాగుప్తా పైవిధంగా స్పందించారు. 


రేఖాగుప్తాపై దాడి చేసింది గుజరాత్‌ రాష్ట్రం రాజ్‌కోట్‌కు చెందిన రాజేష్ సక్రియాగా పోలీసులు గుర్తించారు. సీఎంపై రాజేష్‌ దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ క్రమంలో రేఖాగుప్తాపై దాడి ఘటనపై రాజేష్‌ సక్రియా తల్లి స్పందించారు. తన కుమారుడు జంతుప్రేమికుడని, ఇటీవల వీధికుక్కలపై సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పుతో మనోవేధనకు గురయ్యాడు. ఆ బాధతోనే దాడి చేసి ఉంటారని తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement