
విజయవాడ: ఏపీలో రేషన్ కార్డులను రద్దు చేసి నగదు బదిలీ చేస్తారనే వార్తల నేపథ్యంలో సీపీఐ స్పందించింది. ఈ మేరకు చంద్రబాబు ప్రభుత్వంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మండిపడ్డారు. ‘రేషన్ కార్డులను రద్దు చేసి నగదు బదిలీ చేస్తామంటున్నారు. బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవడం కోసం డబ్బులిస్తామంటున్నారు. బియ్యం షిప్పుల్లో పోయినా.. లారీల్లో పోయినా ప్రభుత్వ పరిధిలోనే కదా జరిగేది.
గతంలో పవన్ వెళ్లి సీజ్ ద షిప్ అన్నారు. పవన్ షిప్ను సీజ్ చేసినప్పుడు మీరు లారీలను సీజ్ చేయలేకపోతున్నారా?, కోటి 47 లక్షల కార్డులున్నాయంటున్నారు. వరల్డ్ బ్యాంక్ సర్వేలో బిలో ప్రోపర్టీ లైన్(బీపీఎల్) బాగా తగ్గి పోయింది. 5.3 శాతమే ఉందంటున్నారు. 5.3 శాతమే బీపీఎల్ కింద ఉంటే కోటి 47 లక్షల కార్డులు ఎందుకున్నాయ్?,
ఆ కార్డులు ఎవరి పేరుతో ఉన్నాయ్ .. ఏ బీరువాలో మూలుగుతున్నాయ్. పక్కాగా మోసం జరుగుతుందని ప్రభుత్వానికి తెలుసు. ఈ మోసంలో ఎవరెవరి ప్రమేయం ఉందో, డబ్బులు వసూలు చేస్తున్నారో ప్రభుత్వం వద్ద సమాచారం ఉంది. దాన్ని అరికట్టలేక మొత్తం అంతా తొలగిస్తామంటున్నారు .మీతీరు ఇంట్లో ఎలకలు పడితే ఇంటికి అగ్గి పెట్టినట్లుంది.
ఎక్కడ తప్పు జరుగుతుందో తెలుసుకుని వారి పై చర్యలు తీసుకోవాలి. అర్హులైన వారికి రేషన్ కార్డు ఇవ్వాలి. బియ్యం అవసరం లేని వర్గాలకు వేరే రకమైన కార్డులు ఇవ్వాలి. రేషన్ బియ్యం తినరు కాబట్టి అమ్ముతున్నారంటున్నారు.తెలంగాణ ప్రభుత్వం మంచి ఆలోచనతో సన్నబియ్యం ఇస్తోంది. జనం క్యూ కట్టి ఆ సన్నబియ్యాన్ని తీసుకుంటున్నారు.

మీరు కూడా ప్రజలు తినేందుకు వీలుగా ఉండే బియ్యం ఇవ్వండి. రేషన్ బియ్యం పథకాన్ని కచ్చితంగా కొనసాగించాల్సిందే. పథకం తీసేస్తే నిజమైన లబ్ధిదారులు , పేదవారు నష్టపోతారు. టీడీపీ ప్రభుత్వమే రేషన్ పథకాన్ని తీసేస్తే ఎన్టీ రామారావుకే అన్యాయం చేసినట్లు. ప్రభుత్వం తమ ఆలోచన మార్చుకోకపోతే ప్రజలు తగిన బుద్ధిచెబుతారు’ అని కె రామకృష్ణ ధ్వజమెత్తారు.