Yalamanchili: సుందరానికి షాక్‌ | Sakshi
Sakshi News home page

Yalamanchili: సుందరానికి షాక్‌

Published Thu, Apr 25 2024 1:36 PM

Controversies in Yalamanchili Janasena

యలమంచిలి జనసేనలో రె‘బెల్స్‌’

వివాదాస్పద నేత సుందరపు విజయ్‌కుమార్‌పై కేసులు

వ్యాపారం పేరుతో మహిళను మోసం చేసిన సుందరపు సోదరులు

గతంలోనే సీపీకి ఫిర్యాదు చేసిన బాధిత మహిళ

తాజాగా మత్స్యకారుడిపై హత్యాయత్నం చేసినట్లు ఆరోపణలు

పూడిమడక మత్స్యకార కుటుంబాలు తిరుగుబాటు  

ఎన్నికల్లో గట్టి బుద్ధి చెబుతామంటూ హెచ్చరికలు

రెబల్‌గా నామినేషన్‌ వేసిన జనసేన మత్స్యకార నేత ఎర్రిపల్లి కిరణ్‌ 

­విశాఖ సిటీ: నోటి దురదతో అందరినీ దుర్భాషలాడడం.. వ్యాపారం పేరుతో మహిళకు మోసం.. నిరసనల పేరుతో పరిశ్రమలకు బ్లాక్‌మెయిలింగ్‌.. తాజాగా మత్స్యకార నాయకుడిపై హత్యాయత్నం.. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. యలమంచిలి నియోజకవర్గం జనసేన అభ్యర్థి సుందరపు విజయ్‌కుమార్‌పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నా యి. స్థానికంగా ప్రజాబలం లేనప్పటికీ.. మత్స్యకారులపై దాడులకు పాల్పడినప్పటికీ.. ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో అతడికి వ్యతిరేకంగా వచ్చినప్పటికీ.. ఆయనకు జనసేనకు టికెట్‌ ఇవ్వడంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రజల్లోనే కాకుండా.. సొంత పార్టీ నేతలు సైతం విజయ్‌ అభ్యరి్థత్వాన్ని గట్టిగా వ్యతిరేకిస్తుండడం గమనార్హం. అతడికి వ్యతిరేకంగా జనసేన పార్టీ రెబల్‌ అభ్యరి్థగా మత్స్యకార నాయకుడు ఎర్రిపల్లి కిరణ్‌ నామినేషన్‌ వేశారు. విజయ్‌కు వ్యతిరేకంగా పూడిమడకతో పాటు మరికొన్ని గ్రామాల్లో జనసేన నాయకులు, అభిమానులు తిరుగుబాటుకు సన్నద్ధమవుతున్నారు.

సుందరపు సోదరులపై సీపీకి ఫిర్యాదు 
సుందరపు సోదరులు వ్యాపారం పేరుతో ఒక మహిళను దారుణంగా మోసం చేశారు. ముందు సుందరపు సతీష్‌ రూ.23 లక్షలు, తరువాత సుందరపు విజయ్‌కుమార్‌ రూ.17 లక్షలు పెట్టుబడులు రూపంలో తీసుకొని తిరిగి ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని సదరు మహిళ 2020లో అప్పటి నగర పోలీస్‌ కమిషనర్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఇప్పుడు సుందరపు వ్యతిరేక వర్గీయులు తెరపైకి తీసుకువస్తున్నారు. వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ జనరల్‌ హాస్పిటల్‌లో కార్డియాలజిస్ట్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ రమేష్‌ ముద్దాడ 2012లో మరణించారు. అతని మరణం అనంతరం వచ్చిన డబ్బుతో భార్య శ్రీదేవి ముద్దాడ, ఇద్దరి పిల్లలను చూసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆ కుటుంబానికి పరిచయం ఉన్న సుందరపు సతీ‹Ùకుమార్‌(సుందరపు విజయ్‌కుమార్‌ సొదరుడు) 2013లో కలిసి ఒక వ్యాపారం కోసం చెప్పాడు.

ఆమెను అక్కా అని పిలిచే సతీష్‌ కర్నాటకలో బల్లారి హెవీ మోటల్‌ వెహికల్‌ వ్యాపారంలో రూ.23 లక్షలు పెట్టుబడి పెడితే నెలకు రూ.1.8 లక్షలు రిటర్న్స్‌ వస్తాయని నమ్మించారు. దీనికి 2013, ఫిబ్రవరిలో ఆమె తన వద్ద ఉన్న బంగారాన్ని తనఖా పెట్టి రూ.23 లక్షలు ఎటువంటి ఒప్పంద పత్రాలు లేకుండానే సతీష్‌కు డబ్బులు ఇచ్చారు. తొలి నాలుగు నెలలు రిటర్న్స్‌ ఇవ్వని సతీష్‌ ఆ తరువాత ఒక ఏడాది పాటు కేవలం 80 వేలు మాత్రమే ఇచ్చాడు. మిగిలిన డబ్బులు జీతాలు, వాహనాలకు ఖర్చు అవుతుందని చెప్పేవాడు. ఆ తరువాత నుంచి అది కూడా ఇవ్వడం మానేశాడు. డబ్బులు కోసం అతడికి ఆడగగా వ్యాపారంలో నష్టం వచ్చిందని, అసలు కూడా రాదని తేల్చి చెప్పేశాడు. దీంతో ఆమె తీసుకున్న రుణం తీర్చడానికి చాలా ఇబ్బందులు పడ్డారు.

కొద్ది రోజులకు విజయ్‌కుమార్‌.. 
కొద్ది రోజులకు విజయ్‌కుమార్‌.. శ్రీదేవిని కలిసి రిలయన్స్‌ టెలీకాంలో 4జీ కేబుల్‌ ప్రాజెక్టుకు రూ.40 లక్షలు పెట్టుబడి పెట్టాలని కోరాడు. ముందు అతని సోదరుడు చేసిన మోసం కారణంగా ఆ ప్రతిపాదనను శ్రీదేవి తిరస్కరించారు. అయితే విజయ్‌కుమార్‌ ఆమెను రిలయన్స్‌ ఆఫీస్‌కు తీసుకువెళ్లి అక్కడి ప్రతినిధులతో మాట్లాడించాడు. మంచి ఆదాయం వస్తుందని, గత వ్యాపారంలో వచ్చిన నష్టాల నుంచి బయటపడడానికి మంచి అవకాశమని, సంస్థ నుంచి బిల్లులు కూడా నేరుగా ఆమె అకౌంట్‌లోనే పడతాయని నమ్మించాడు. దీంతో ఆమె మరోసారి నమ్మి తన భర్త ఫ్లాట్‌పై లోన్‌ తీసుకొని రూ.17 లక్షలు సుందరపు విజయ్‌కుమార్‌కు ఇచ్చారు.

విజయ్‌కుమార్‌ జనసేన పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉండడంతో శ్రీదేవి ఆ పనులు చూసుకోవడం ప్రారంభించారు. మొత్తం ప్రాజెక్ట్‌ వర్క్‌ పూర్తయినప్పటికీ.. ఆమె ఖాతాలో డబ్బులు పడలేదు. దీంతో ఆమె నేరుగా రిలయన్స్‌ ఆఫీస్‌కు వెళ్లి వాకబు చేయగా ఆ పనులకు సంబంధించి బిల్స్‌ విజయ్‌కుమార్‌ అకౌంట్‌కు రిలీజ్‌ చేసినట్లు చెప్పారు. దీంతో డబ్బు కోసం శ్రీదేవి.. సుందరపు విజయ్‌కుమార్‌ను అడిగారు. దీనికి ఆయన చెప్పిన సమాధానం విని షాక్‌కు గురయ్యారు. పనులు చేయించిన ఉద్యోగికి రూ.10 వేలు మాత్రమే ఇస్తామని, మహిళ కాబట్టి ఆమెకు నెలకు రూ.20 వేలు చొప్పున ఎన్ని నెలలు పనిచేస్తే అంత డబ్బు ఇవ్వాలని విజయ్‌ తన మనిíÙకి పురమాయించాడు. దీంతో పెట్టుబడి డబ్బులు ఇవ్వాలని అడిగినా విజయ్‌కుమార్‌ ఆమెను పట్టించుకోలేదు. ఎప్పటికప్పుడు ఆమె అతడిని డబ్బు కోసం అడగగా కొద్ది నెలల్లో ఇస్తానని రాతపూర్వకంగా హామీ ఇచ్చాడు. అయినప్పటికీ డబ్బు తిరిగి చెల్లించలేదు. దీంతో శ్రీదేవి అప్పటి నగర పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.

మత్స్యకార నేతపై హత్యాయత్నం
యలమంచిలి జనసేన అభ్యర్థి సుందరపు విజయ్‌కుమార్‌ పూడిమడక గ్రామ నివాసి, అదే పార్టీకి చెందిన మత్స్యకారుడు ఎర్రిçపల్లి కిరణ్‌పై దాడి, హత్యా ప్రయత్నాలు చేసినట్లు ఆరోపణలు ఇప్పుడు నియోజకవర్గంలో హాట్‌ టాపిక్‌గా మారాయి. ఈ ఘటనతో పూడిమాడకతో పాటు తీర ప్రాంతవాసులు, ఉమ్మడి విశాఖలో మత్స్యకారులు సుందరపు విజయ్‌కుమార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూడిమడకకు చెందిన కిరణ్‌ చురుగ్గా జనసేన పారీ్టలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. దీంతో జనసేన అధినాయకులు సైతం అతడిని అభినందించారు. 

అయితే సుందరపు విజయ్‌కుమార్‌ మాత్రం కిరణ్‌పై కక్ష గట్టి దాడికి పాల్పడినట్లు ఆరోపిస్తున్నారు. దీనిపై కిరణ్, అతని కుటుంబ సభ్యులు, పూడిమడక గ్రామస్తులు పలుమార్లు మీడియా సమావేశాలు నిర్వహించి సుందరపు విజయ్‌కుమార్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. తాజాగా మత్స్యకార నేత కిరణ్‌ జనసేన రెబల్‌ అభ్యరి్థగా నామినేషన్‌ వేశారు. సుందరపు విజయ్‌కుమార్‌కు జనసేన టికెట్‌ ఇవ్వడం పట్ల మత్స్యకారులు తీవ్రస్థాయి మండిపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయ్‌కు గట్టి బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో సుందరపు వర్గీయులలో ఆందోళన వ్యక్తమవుతోంది.   

Advertisement
Advertisement