ఫిరాయింపుల ముఠా నాయకుడు పోచారం: జీవన్‌రెడ్డి | congress mlc jeevan reddy sensational comments on anti defection | Sakshi
Sakshi News home page

ఫిరాయింపుల ముఠా నాయకుడు పోచారం: జీవన్‌రెడ్డి

Oct 24 2024 12:20 PM | Updated on Oct 24 2024 3:19 PM

congress mlc jeevan reddy sensational comments on anti defection

హైదరాబాద్‌, సాక్షి: పార్టీ ఫిరాయింపులకు పాల్పడకుండా చట్టం రూపొందించిన ఘనత  కాంగ్రెస్‌ పార్టీకి దక్కుతుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత , ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్‌లో ప్రస్తుత పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నాం. మానసిక ఆవేదనలో ఉన్నా. ఫిరాయింపులపై ఖర్గేకు లేఖ రాశా. ఫిరాయింపుల చట్టం లొసుగులతో పార్టీ మారుతున్నారు. కొందరు అభివృద్ధి అనే నినాదంతో పార్టీ ఫిరాయించారు. పార్టీ ఫిరాయింపులను నిరోధించేందుకు రాజీవ్ గాంధీ చట్టం తెచ్చారు. ఇప్పుడు ఆ చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. 

కాంగ్రెస్ సుస్థిర ప్రభుత్వానికి కావాల్సిన మెజారిటీ ఉంది.. ఫిరాయింపుల అవసరం లేదు.  దురదృష్టవశాత్తు నేను అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా.. రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిందని సంతోషించా. ఎమ్మెల్యే ల చేరికలు ఎందుకు అనేది అర్థం కాని పరిస్థితి. జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ అంటేనే జీవన్ రెడ్డి అనే పరిస్థితి ఉంది. పార్టీ నాకు అవకాశం ఇచ్చింది.. పార్టీకి నేను అంతే గౌరవం ఇచ్చా. పదేళ్లు బీఆర్ఎస్ దౌర్జన్యాలను ఎదుర్కొన్నాం. మళ్లీ కాంగ్రెస్ ముసుగులో దౌర్జన్యం చేస్తామంటే మేము ఎలా సహించాలి.

నామినేటెడ్ పదవులు, అధికారం చెలాయించాలని కొత్తగా చేరిన ఎమ్మెల్యే లు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో మా పరిస్థితి ఏంటి?. పార్టీ ఫిరాయింపుల ముఠా నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి. ఫిరాయింపుదారుల ఎమ్మెల్యేలతో సమావేశం పెట్టి మాపై పెత్తనం చేయాలని పోచారం ఆదేశించారు. పది మంది ఎమ్మెల్యేలు లేకుండా మా ప్రభుత్వం కొనసాగదా. రాహుల్ గాంధీ కోరుకున్న ప్రజాస్వామ్య విలువలు ఇవ్వేనా. 

పార్టీ ఫిరాయింపులపై పోచారం శ్రీనివాస్‌రెడ్డికి చాలా అనుభవం ఉంది. పార్టీ ఫిరాయింపుల క్రమబద్ధీకరణకు పోచారం సలహాలు ఇస్తారు. అసలు పోచారం సలహాదారుడు ఏంటి? భట్టి సీఏల్పీ పదవి పోవడానికి పోచారం కారణం కాదా? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి.. పార్టీ బలోపేతం కావాలనేదే నా భవిష్యత్ కార్యాచరణ. 

గంగారెడ్డిని హత్యచేసిన సంతోష్ బీఆర్ఎస్ పార్టీ వ్యక్తి. ఎమ్మెల్యే చేరికతో సంతోష్ ఇప్పుడు కాంగ్రెస్ ముసుగు వేసుకున్నాడు. ఆదిపత్యపోరుతో గంగారెడ్డిని హత్యచేశారు. గంగారెడ్డి మార్కెట్ కమిటీ ఛైర్మన్ పోటీలో ఉన్నారు. గుమ్మడి కాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్లు  డాక్టర్‌ సంజయ్ కుమారు నాకు హత్యతో సంబంధం లేదు అంటున్నారు. సంజయ్ ఇంట్లోనే కాంగ్రెస్ పుడితే.. బీఆర్ఎస్‌కలోకి ఎందుకు పోయాడు?. అధికార పార్టీలో చేరితేనే అభివృద్ధి జరుగుతుంది అంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉంటుందా? చేరికలను నేను ముందే వ్యతిరేకించా’’ అని అన్నారు.

రాజీవ్ గాంధీ తెచ్చిన చట్టానికి తూట్లు.. జీవన్ రెడ్డి ఆగ్రహం..

చదవండి:  ఈరోజు మమ్మల్ని కాంగ్రెస్‌ పార్టీ చంపేసింది 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement