యంగ్‌ ఇండియా నా బ్రాండ్‌: సీఎం రేవంత్‌ | CM Revanth Reddy at inauguration of Young India Police School | Sakshi
Sakshi News home page

యంగ్‌ ఇండియా నా బ్రాండ్‌: సీఎం రేవంత్‌

Apr 11 2025 3:49 AM | Updated on Apr 11 2025 5:05 AM

CM Revanth Reddy at inauguration of Young India Police School

పోలీస్‌ స్కూల్‌ ప్రారంభించిన అనంతరం విద్యార్థులతో కలసి సరదాగా ఫుట్‌బాల్‌ ఆడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి

ఎడ్యుకేషన్, ఎంప్లాయ్‌మెంట్‌ అనేది మా బ్రాండ్‌  ∙విద్య, వైద్యం, ఉపాధికే మా ప్రాధాన్యం 

యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

పోలీసులు తమ పిల్లల చదువు విషయంలో ఆందోళన చెందకుండా ఉండేందుకే ఈ స్కూల్‌ 

సైనిక్‌ స్కూల్‌కు దీటుగా ఒక బ్రాండ్‌ను క్రియేట్‌ చేసేలా ఈ పాఠశాలను తీర్చిదిద్దాలి 

ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లోనూ ప్రీస్కూల్‌ 

ప్రైవేటుబడుల  మాదిరిగా నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ 

నిరుపేద పిల్లలకు ఉచితంగా రవాణా సదుపాయం

సాక్షి, హైదరాబాద్‌: ‘గతంలో ప్రధాన మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారికి ఒక్కొక్కరికి ఒక్కో బ్రాండ్‌ ఉందని, అధికారంలోకి వచ్చి 16 నెలలైనా ఏ బ్రాండ్‌ సృష్టించుకోలేదని కొందరు అంటున్నారు. విమర్శకులకు నా సమాధానం ఇదే..నా బ్రాండ్‌ యంగ్‌ ఇండియా..మహాత్మాగాంధీ స్ఫూర్తితో యంగ్‌ ఇండియా బ్రాండ్‌ను తెలంగాణలో క్రియేట్‌ చేసుకున్నాం. 

ఎడ్యుకేషన్, ఎంప్లాయ్‌మెంట్‌ అనేది మా బ్రాండ్‌. విద్య, వైద్యం, ఉపాధికే మా ప్రాధాన్యం..’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో నిర్మించిన యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు. 

రూ.100 కోట్లతో కార్పస్‌ ఫండ్‌ 
‘దేశ భవిష్యత్‌ తరగతి గదుల్లోనే ఉందని నేను విశ్వసిస్తా. నిత్యం విధుల్లో ఉండే పోలీసులు వారి పిల్లల చదువుల విషయంలో ఆందోళనతో ఉండొద్దన్న ఉద్దేశంతోనే యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌ ఏర్పాటు చేశాం. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చాం. సైనిక్‌ స్కూల్‌కు దీటుగా పోలీస్‌ స్కూల్‌ను తీర్చిదిద్దాలి. పోలీసు స్కూల్‌లో చదివామన్న ఒక బ్రాండ్‌ను క్రియేట్‌ చేసేలా తయారు చేయాలి. కావాల్సిన నిధులు, అనుమతులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 

కేజీ నుంచి పీజీ వరకు తీర్చిదిద్దుకోండి. హైదరాబాద్‌ చుట్టుపక్కల ఉన్న ఎన్నో కంపెనీలకు పోలీసులు రక్షణ కల్పిస్తున్నారు. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కింద కొన్ని నిధులను అందించాల్సిన బాధ్యత ఆ సంస్థలకు ఉంది. పోలీస్‌ స్కూల్‌ కోసం రూ.100 కోట్లతో కార్ఫస్‌ ఫండ్‌ ఏర్పాటు చేసుకోవాలని డీజీపీని ఆదేశిస్తున్నా. ఇందుకు అవసరమైన అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది..’ అని సీఎం చెప్పారు.  

రైతు బాంధవుడిగా వైఎస్సార్‌ ఎప్పటికీ గుర్తుంటారు.. 
‘దేశ చరిత్రలో ఎంతోమంది ప్రధానులు, ముఖ్యమంత్రులు అయ్యారు. కానీ అందులో కొద్దిమంది మాత్రమే చరిత్రలో గుర్తుండిపోయారు. ఆ కొద్దిమంది తీసుకున్న నిర్ణయాలు చరిత్రను మలుపు తిప్పాయి. జలయజ్ఞం, వ్యవసాయాన్ని ప్రాధాన్యతగా తీసుకుని ఉచిత కరెంటు ఇవ్వడం, సాగునీటి ప్రాజెక్టులు నిర్మించడం మొదలు రైతుల సమస్యలను చర్చించినప్పుడు రైతు బాంధవుడిగా డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి గుర్తుకు వస్తారు. రూ.2 కిలో బియ్యంతో ఎన్టీఆర్‌ ప్రతి పేదవాడి మనసులో స్థానం సంపాదించుకున్నారు. 

చంద్రబాబు హైదరాబాద్‌లో ఐటీని అభివృద్ధి చేశారు. సంస్కరణలతో భారతదేశాన్ని ప్రపంచంతో పోటీపడే స్థాయిలో నిలిపిన ఘనత తెలంగాణ బిడ్డ పీవీ నర్సింహారావుది. ఆనాడు పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ ఎడ్యుకేషన్, ఇరిగేషన్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన దార్శనికతతోనే మన దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయికి చేరింది. అయితే తెలంగాణ ప్రదాతలం, ఉద్యమకారులమని కొందరు బ్రాండ్‌లు క్లెయిమ్‌ చేసుకుంటుంటారు. వారి గురించి నేను చర్చించను..’ అని రేవంత్‌ పేర్కొన్నారు. 

మన విద్యా విధానం ప్రాథమిక స్థాయిలోనే లోపం 
‘ప్రభుత్వ పాఠశాలల్లోనూ ప్రీ స్కూల్‌ విధానం ప్రవేశపెట్టాలనే ఆలోచనలో ఉన్నాం. రాష్ట్రంలో 29 వేల ప్రభుత్వ స్కూళ్లు ఉంటే, వాటిల్లో 18.50 లక్షల మంది పిల్లలు చదువుతున్నారు. ప్రైవేటులో 11,500 స్కూళ్లు ఉంటే వాటిల్లో 30 లక్షల మంది విద్యార్థులున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ అర్హతలు ఉన్న వారు పని చేస్తున్నప్పటికీ విద్యార్థులు చేరడం లేదంటే మన విద్యా విధానంలో ఉన్న లోపాలు ఏమిటనే ఆలోచన చేశాం. ప్రాథమిక స్థాయిల్లోనే అస్పష్టత ఉందనే విషయం గమనించాం. 

నిపుణులతో చర్చించిన తర్వాత  ప్రభుత్వ బడుల్లోనూ ప్రైవేటు పాఠశాలల మాదిరిగా ప్రీస్కూల్‌ విధానం ప్రవేశపెట్టాలని, నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ అందుబాటులోకి తేవాలనే ఆలోచన చేశాం. ప్రైవేటు స్కూళ్లల్లో పిల్లలకు ఎలాగైతే రవాణా సౌకర్యం ఉంటుందో అదే తరహాలో నిరుపేదల పిల్లలకు ఉచితంగా రవాణా సదుపాయాలు కల్పించి వారికి ఉత్తమమైన ప్లే స్కూల్‌ విద్యను అందించాలని నిర్ణయించాం..’ అని ముఖ్యమంత్రి వెల్లడించారు.   

స్కిల్స్‌ యూనివర్సిటీ విద్యార్థులు ప్రతి ఒక్కరికీ ఉద్యోగ భద్రత 
‘విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు పెద్ద పెద్ద కంపెనీల భాగస్వామ్యంతో యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకున్నాం. ఈ వర్సిటీలో చేరే ప్రతి విద్యారి్థకి ఉద్యోగ భద్రత లభిస్తుంది. ఈ యూనివర్సిటీతో పాటు, యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీ, యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ అకాడమీ మొదలు పెట్టాం. ఇవి కాకుండా 58 నియోజకవర్గాల్లో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లను చేపట్టాం..’ అని రేవంత్‌ వివరించారు.  

పోలీసులకు ఎంత చేసినా తక్కువే: మంత్రి శీధర్‌బాబు  
దేశంలో ఎక్కడా లేని విధంగా పోలీసుల పిల్లల కోసం ప్రత్యేకంగా పాఠశాల ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణకే దక్కుతుందని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ప్రజల ప్రశాంత జీవనం కోసం ఎన్నో త్యాగాలు చేసే పోలీసుల కోసం ఎంత చేసినా తక్కువే అని అన్నారు. డీజీపీ జితేందర్‌ మాట్లాడుతూ.. పోలీసుల పిల్లల పరిస్థితులు అర్థం చేసుకుని  ప్రత్యేకంగా పాఠశాలను ఏర్పాటు చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి పోలీస్‌శాఖ తరఫున ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ మాట్లాడుతూ..ఈ స్కూల్‌లో ఫీజులు ఎక్కువగా ఉన్నాయన్న అంశంపై దృష్టి పెట్టామని, తగ్గింపుపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపారు. 

విద్యార్థులకు కిట్లు 
స్కూలు విద్యార్థులకు యూనిఫాం, ఇతర వస్తువులు ఉన్న కిట్లను సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు అందజేశారు. పోలీస్‌ స్కూల్‌ ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతగా పోలీస్‌ అధికారులు, సిబ్బంది తమ క్యాప్‌లను చేతపట్టుకుని ఊపుతూ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. స్కూల్‌ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన విశాల్‌ గోయల్, శరత్, ఎస్పీ రెడ్డిలను సీఎం జ్ఞాపికలతో సత్కరించారు. 

గోల్‌ కొట్టిన ముఖ్యమంత్రి 
పోలీస్‌ స్కూల్‌ను ప్రారంభించిన తర్వాత సీఎం పాఠశాలను పరిశీలించారు. కాసేపు విద్యార్థులతో ముచ్చటించడంతో పాటు వారితో సరదాగా ఫుట్‌బాల్‌ ఆడారు. పది మంది చిన్నారులు తన నుంచి బాల్‌ను తీసుకునేందుకు పోటీ పడుతున్నా, వారిని తప్పించుకుని గోల్‌ కొట్టి అబ్బుర పరిచారు.  

సామాజిక బాధ్యత కింద విరాళాలు 
పోలీస్‌ స్కూల్‌కు సీఎస్‌ఆర్‌ కింద ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి రూ.30 లక్షలు, ఎసీ రెడ్డి రూ.కోటి, జీజీఎస్‌ ఇంజనీరింగ్‌కు చెందిన ప్రవీణ్‌రెడ్డి రూ. 50 లక్షలు, తేజస్వి డెవలపర్స్‌కు చెందిన నిరంజన్‌ రూ.50 లక్షలు విరాళం ప్రకటించారు. కార్యక్రమంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, కాలే యాదయ్య, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, ఇంటెలిజెన్స్‌ డీజీ శివధర్‌రెడ్డి, సీఐడీ డీజీ శిఖాగోయల్, జైళ్లశాఖ డీజీ సౌమ్యా మిశ్రా, గ్రేహౌండ్స్‌ అడిషనల్‌ డీజీ స్టీఫెన్‌ రవీంద్ర, ఇతర పోలీస్, జైళ్ల శాఖల అధికారులు, కుటుంబసభ్యులు పాల్గొన్నారు.  

చిన్నారులతో సందడి చేసిన సీఎం 
మణికొండ: గండిపేట మండలం, మంచిరేవులలో యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌ ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిన్నారులతో కలిసి సందడి చేశారు. విద్యార్థులతో కలిసి ఫుట్‌ బాల్‌ ఆడి వారిని ఉత్తేజ పరిచారు. పది మంది చిన్నారులు సీఎం నుంచి బాల్‌ను తీసుకునేందుకు పోటీ పడుతున్నా వారిని ఏ మార్చి గోల్‌ కొట్టి వారిని అబ్బుర పరిచారు. పాఠశాలలో ఉన్న సౌకర్యాలు, ఇంకా ఏర్పాటు చేయాల్సిన వాటి గురించి చిన్నారులను అడిగి తెలుసుకున్నారు. వారి కోరికలు విని పాఠశాలను వారి ఆశలకు అనుగుణంగా తీర్చి దిద్దాలని పోలీసు అధికారులకు సూచనలు చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement