preschool
-
యంగ్ ఇండియా నా బ్రాండ్: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘గతంలో ప్రధాన మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారికి ఒక్కొక్కరికి ఒక్కో బ్రాండ్ ఉందని, అధికారంలోకి వచ్చి 16 నెలలైనా ఏ బ్రాండ్ సృష్టించుకోలేదని కొందరు అంటున్నారు. విమర్శకులకు నా సమాధానం ఇదే..నా బ్రాండ్ యంగ్ ఇండియా..మహాత్మాగాంధీ స్ఫూర్తితో యంగ్ ఇండియా బ్రాండ్ను తెలంగాణలో క్రియేట్ చేసుకున్నాం. ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అనేది మా బ్రాండ్. విద్య, వైద్యం, ఉపాధికే మా ప్రాధాన్యం..’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో నిర్మించిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో కలిసి గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు. రూ.100 కోట్లతో కార్పస్ ఫండ్ ‘దేశ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉందని నేను విశ్వసిస్తా. నిత్యం విధుల్లో ఉండే పోలీసులు వారి పిల్లల చదువుల విషయంలో ఆందోళనతో ఉండొద్దన్న ఉద్దేశంతోనే యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఏర్పాటు చేశాం. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చాం. సైనిక్ స్కూల్కు దీటుగా పోలీస్ స్కూల్ను తీర్చిదిద్దాలి. పోలీసు స్కూల్లో చదివామన్న ఒక బ్రాండ్ను క్రియేట్ చేసేలా తయారు చేయాలి. కావాల్సిన నిధులు, అనుమతులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కేజీ నుంచి పీజీ వరకు తీర్చిదిద్దుకోండి. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఎన్నో కంపెనీలకు పోలీసులు రక్షణ కల్పిస్తున్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద కొన్ని నిధులను అందించాల్సిన బాధ్యత ఆ సంస్థలకు ఉంది. పోలీస్ స్కూల్ కోసం రూ.100 కోట్లతో కార్ఫస్ ఫండ్ ఏర్పాటు చేసుకోవాలని డీజీపీని ఆదేశిస్తున్నా. ఇందుకు అవసరమైన అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది..’ అని సీఎం చెప్పారు. రైతు బాంధవుడిగా వైఎస్సార్ ఎప్పటికీ గుర్తుంటారు.. ‘దేశ చరిత్రలో ఎంతోమంది ప్రధానులు, ముఖ్యమంత్రులు అయ్యారు. కానీ అందులో కొద్దిమంది మాత్రమే చరిత్రలో గుర్తుండిపోయారు. ఆ కొద్దిమంది తీసుకున్న నిర్ణయాలు చరిత్రను మలుపు తిప్పాయి. జలయజ్ఞం, వ్యవసాయాన్ని ప్రాధాన్యతగా తీసుకుని ఉచిత కరెంటు ఇవ్వడం, సాగునీటి ప్రాజెక్టులు నిర్మించడం మొదలు రైతుల సమస్యలను చర్చించినప్పుడు రైతు బాంధవుడిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి గుర్తుకు వస్తారు. రూ.2 కిలో బియ్యంతో ఎన్టీఆర్ ప్రతి పేదవాడి మనసులో స్థానం సంపాదించుకున్నారు. చంద్రబాబు హైదరాబాద్లో ఐటీని అభివృద్ధి చేశారు. సంస్కరణలతో భారతదేశాన్ని ప్రపంచంతో పోటీపడే స్థాయిలో నిలిపిన ఘనత తెలంగాణ బిడ్డ పీవీ నర్సింహారావుది. ఆనాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఎడ్యుకేషన్, ఇరిగేషన్కు ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన దార్శనికతతోనే మన దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయికి చేరింది. అయితే తెలంగాణ ప్రదాతలం, ఉద్యమకారులమని కొందరు బ్రాండ్లు క్లెయిమ్ చేసుకుంటుంటారు. వారి గురించి నేను చర్చించను..’ అని రేవంత్ పేర్కొన్నారు. మన విద్యా విధానం ప్రాథమిక స్థాయిలోనే లోపం ‘ప్రభుత్వ పాఠశాలల్లోనూ ప్రీ స్కూల్ విధానం ప్రవేశపెట్టాలనే ఆలోచనలో ఉన్నాం. రాష్ట్రంలో 29 వేల ప్రభుత్వ స్కూళ్లు ఉంటే, వాటిల్లో 18.50 లక్షల మంది పిల్లలు చదువుతున్నారు. ప్రైవేటులో 11,500 స్కూళ్లు ఉంటే వాటిల్లో 30 లక్షల మంది విద్యార్థులున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ అర్హతలు ఉన్న వారు పని చేస్తున్నప్పటికీ విద్యార్థులు చేరడం లేదంటే మన విద్యా విధానంలో ఉన్న లోపాలు ఏమిటనే ఆలోచన చేశాం. ప్రాథమిక స్థాయిల్లోనే అస్పష్టత ఉందనే విషయం గమనించాం. నిపుణులతో చర్చించిన తర్వాత ప్రభుత్వ బడుల్లోనూ ప్రైవేటు పాఠశాలల మాదిరిగా ప్రీస్కూల్ విధానం ప్రవేశపెట్టాలని, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అందుబాటులోకి తేవాలనే ఆలోచన చేశాం. ప్రైవేటు స్కూళ్లల్లో పిల్లలకు ఎలాగైతే రవాణా సౌకర్యం ఉంటుందో అదే తరహాలో నిరుపేదల పిల్లలకు ఉచితంగా రవాణా సదుపాయాలు కల్పించి వారికి ఉత్తమమైన ప్లే స్కూల్ విద్యను అందించాలని నిర్ణయించాం..’ అని ముఖ్యమంత్రి వెల్లడించారు. స్కిల్స్ యూనివర్సిటీ విద్యార్థులు ప్రతి ఒక్కరికీ ఉద్యోగ భద్రత ‘విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు పెద్ద పెద్ద కంపెనీల భాగస్వామ్యంతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకున్నాం. ఈ వర్సిటీలో చేరే ప్రతి విద్యారి్థకి ఉద్యోగ భద్రత లభిస్తుంది. ఈ యూనివర్సిటీతో పాటు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీ మొదలు పెట్టాం. ఇవి కాకుండా 58 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను చేపట్టాం..’ అని రేవంత్ వివరించారు. పోలీసులకు ఎంత చేసినా తక్కువే: మంత్రి శీధర్బాబు దేశంలో ఎక్కడా లేని విధంగా పోలీసుల పిల్లల కోసం ప్రత్యేకంగా పాఠశాల ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణకే దక్కుతుందని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. ప్రజల ప్రశాంత జీవనం కోసం ఎన్నో త్యాగాలు చేసే పోలీసుల కోసం ఎంత చేసినా తక్కువే అని అన్నారు. డీజీపీ జితేందర్ మాట్లాడుతూ.. పోలీసుల పిల్లల పరిస్థితులు అర్థం చేసుకుని ప్రత్యేకంగా పాఠశాలను ఏర్పాటు చేసిన సీఎం రేవంత్రెడ్డికి పోలీస్శాఖ తరఫున ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ..ఈ స్కూల్లో ఫీజులు ఎక్కువగా ఉన్నాయన్న అంశంపై దృష్టి పెట్టామని, తగ్గింపుపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపారు. విద్యార్థులకు కిట్లు స్కూలు విద్యార్థులకు యూనిఫాం, ఇతర వస్తువులు ఉన్న కిట్లను సీఎం రేవంత్రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు అందజేశారు. పోలీస్ స్కూల్ ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతగా పోలీస్ అధికారులు, సిబ్బంది తమ క్యాప్లను చేతపట్టుకుని ఊపుతూ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. స్కూల్ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన విశాల్ గోయల్, శరత్, ఎస్పీ రెడ్డిలను సీఎం జ్ఞాపికలతో సత్కరించారు. గోల్ కొట్టిన ముఖ్యమంత్రి పోలీస్ స్కూల్ను ప్రారంభించిన తర్వాత సీఎం పాఠశాలను పరిశీలించారు. కాసేపు విద్యార్థులతో ముచ్చటించడంతో పాటు వారితో సరదాగా ఫుట్బాల్ ఆడారు. పది మంది చిన్నారులు తన నుంచి బాల్ను తీసుకునేందుకు పోటీ పడుతున్నా, వారిని తప్పించుకుని గోల్ కొట్టి అబ్బుర పరిచారు. సామాజిక బాధ్యత కింద విరాళాలు పోలీస్ స్కూల్కు సీఎస్ఆర్ కింద ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి రూ.30 లక్షలు, ఎసీ రెడ్డి రూ.కోటి, జీజీఎస్ ఇంజనీరింగ్కు చెందిన ప్రవీణ్రెడ్డి రూ. 50 లక్షలు, తేజస్వి డెవలపర్స్కు చెందిన నిరంజన్ రూ.50 లక్షలు విరాళం ప్రకటించారు. కార్యక్రమంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాశ్గౌడ్, కాలే యాదయ్య, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, ఇంటెలిజెన్స్ డీజీ శివధర్రెడ్డి, సీఐడీ డీజీ శిఖాగోయల్, జైళ్లశాఖ డీజీ సౌమ్యా మిశ్రా, గ్రేహౌండ్స్ అడిషనల్ డీజీ స్టీఫెన్ రవీంద్ర, ఇతర పోలీస్, జైళ్ల శాఖల అధికారులు, కుటుంబసభ్యులు పాల్గొన్నారు. చిన్నారులతో సందడి చేసిన సీఎం మణికొండ: గండిపేట మండలం, మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చిన్నారులతో కలిసి సందడి చేశారు. విద్యార్థులతో కలిసి ఫుట్ బాల్ ఆడి వారిని ఉత్తేజ పరిచారు. పది మంది చిన్నారులు సీఎం నుంచి బాల్ను తీసుకునేందుకు పోటీ పడుతున్నా వారిని ఏ మార్చి గోల్ కొట్టి వారిని అబ్బుర పరిచారు. పాఠశాలలో ఉన్న సౌకర్యాలు, ఇంకా ఏర్పాటు చేయాల్సిన వాటి గురించి చిన్నారులను అడిగి తెలుసుకున్నారు. వారి కోరికలు విని పాఠశాలను వారి ఆశలకు అనుగుణంగా తీర్చి దిద్దాలని పోలీసు అధికారులకు సూచనలు చేశారు. -
మణికొండ: ప్లే స్కూల్లో మంటలు.. పరుగు తీసిన చిన్నారులు
సాక్షి, హైదరాబాద్: మణికొండలోని జోల్లి కిడ్స్ ప్లేస్కూల్ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం షార్ట్ సర్క్యూట్తో మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. కాగా, మంటలు ఎగసిపడటం, పొగ బయటకు రావడంతో భయంతో చిన్నారులు పరుగు తీశారు. ఇక, అగ్ని ప్రమాదం సంభవించడంతో చిన్నారుల పేరెంట్స్ భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే స్కూల్ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఫైర్ టెండర్స్ అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇది కూడా చదవండి: ఆరు లేన్లుగా ఎన్హెచ్-65.. నితిన్ గడ్కరీ హామీ! -
అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ స్కూల్ విద్య : మంత్రి
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని అర్బన్ ప్రాంతాల్లో ఉన్న అంగనవాడీ కేంద్రాలను విలీనం చేసి ఒక యూనిట్గా ఏర్పాటు చేస్తున్నట్టు మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి తానేటి వనిత వెల్లడించారు. మంగళవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విశాఖలో 20 సెంటర్లను ఒక యూనిట్గా, శ్రీకాకుళంలో 7 సెంటర్లను ఒక యూనిట్గా, కడపలో 10 సెంటర్లను ఒక యూనిట్గా ఏర్పాటు చేసి అందులో చిన్నారులకు కిండర్ గార్డెన్ విద్యను అందిస్తున్నామని వివరించారు. యూనిట్లను ఏర్పాటు చేసిన తర్వాత పిల్లల సంఖ్య 18,041కు పెరిగిందని పేర్కొన్నారు. నర్సరీ విద్యను బోధించేందుకు అంగన్వాడీ సిబ్బందికి ప్రీ స్కూల్ ట్రైనింగ్ ఇచ్చామని తెలిపారు. అంగన్వాడీ సెంటర్లలో గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం తీసుకునేందుకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే.. వాటిని కూడా పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. -
ప్రీ స్కూల్తో న్యూ లుక్
► అంగన్వాడీ కేంద్రాలకు కొత్త కళ ► కాన్వెంట్లను తలపిస్తున్న కేంద్రాలు ఒంగోలు టౌన్: ప్రీ స్కూల్తో అంగన్వాడీ కేంద్రాలకు కొత్త కళ వచ్చింది. ఇప్పటి వరకూ అరకొరగా ఇరుకు గదుల్లో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రాలు నూతన శోభను సంతరించుకున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి అంగన్వాడీ కేంద్రాల్లో కాన్వెంట్ విద్యను అందించాలన్న ఉద్దేశంతో కేంద్రాల రూపు రేఖలను మార్చేస్తున్నారు. ప్రైవేట్ కాన్వెంట్లకు మాదిరిగా కేంద్రాల్లోని తరగతి గదులకు రకరకాల రంగులు వేయడంతో వాటికి న్యూ లుక్ వస్తోంది. జిల్లాలోని ఒంగోలు, చీరాల, కందుకూరు, మార్కాపురం అర్బన్ ప్రాంతాల్లోని అంగన్వాడీ కేంద్రాలు ప్రీ స్కూల్తో రకరకాల రంగులతో ముస్తాబు అవుతున్నాయి. ప్రీ స్కూల్లో చిన్నారులు అడుగు పెట్టిన వెంటనే ఇంగ్లిష్ లెటర్లు, ఆ లెటర్లకు సంబంధించిన పదాలు, వాటికి సంబంధించిన బొమ్మలతో తరగతి గదులను చక్కగా తయారు చేస్తున్నారు. అంతేగాకుండా రకరకాల బొమ్మలు, పక్షులు, బెలూన్లకు సంబంధించిన పెయింటింగ్లను వేయిస్తున్నారు. మూడేళ్ల నుంచి ఐదేళ్లలోపు చిన్నారులను అంగన్వాడీ కేంద్రాలకు రప్పించాలన్న ఉద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి చిన్నారుల తల్లిదండ్రుల నుంచి విశేష స్పందన రాబట్టుకునేందుకు ఐసీడీఎస్ అధికారులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. జిల్లాలో తొలి విడతగా అర్బన్ ప్రాంతాల్లో ప్రీ స్కూల్ ద్వారా కాన్వెంట్ విద్యను అందించాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఒంగోలు అర్బన్ ప్రాంతంలోని 171 అంగన్వాడీ కేంద్రాలు, చీరాల అర్బన్ ప్రాంతంలోని 90 అంగన్వాడీ కేంద్రాలు, మార్కాపురం అర్బన్ ప్రాంతంలోని 80 అంగన్వాడీ కేంద్రాలు, కందుకూరు అర్బన్ ప్రాంతంలోని 60 అంగన్వాడీ కేంద్రాల్లో తొలిసారిగా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యను చిన్నారులకు అందించనున్నారు. ఇందుకు అర్బన్ ప్రాంతాల వారీగా సంబంధిత అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ తరగతులు కూడా ప్రారంభించారు. ఒంగోలు అర్బన్ ప్రాంత పరిధిలోని 171 అంగన్వాడీ కార్యకర్తలకు శుక్రవారంతో శిక్షణ తరగతులు ముగిశాయి. జిల్లా స్థాయిలో ప్రీ స్కూల్స్ ట్రైనింగ్ కన్సల్టెంట్గా సండ్ర భాగ్యలక్ష్మిని నియమించారు. ఆమె పర్యవేక్షణలో శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. దశలవారీగా విస్తరణ ప్రీ స్కూల్ను దశలవారీగా విస్తరించాలన్న ఆలోచనలో మహిళా శిశుసంక్షేమశాఖ ఉన్నతాధికారులు ఉన్నారు. ప్రస్తుతం అర్బన్ ప్రాంతాల్లో అమలు చేయనున్న కాన్వెంట్ విద్య ద్వారా వచ్చే ఫలితాల ఆధారంగా రూరల్ ప్రాంతాల్లో కూడా అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. అర్బన్ ప్రాంతాల్లోని ప్రీ స్కూల్స్ నిర్వహణకు సంబంధించిన బాధ్యతలను సంబంధిత మునిసిపల్ అధికారులు చూస్తున్నారు. రూరల్ ప్రాంతాల్లోని అంగన్వాడీ కేంద్రాలను సంబంధిత మండల అధికారులకు బాధ్యతలను అప్పగించి వాటిని మరింత ఆకర్షవంతంగా తీర్చిదిద్ది ఎక్కువ శాతం చిన్నారులను కాన్వెంట్ల వైపు కాకుండా ప్లే స్కూల్స్గా మారుతున్న అంగన్వాడీ కేంద్రాలకు రప్పించేందుకు చర్యలు చేపట్టారు. జిల్లాకు తొలి విడతగా 4900 పుస్తకాలు అర్బన్ ప్రాంతాల్లోని అంగన్వాడీ కేంద్రాలను ప్రీ స్కూల్స్గా మార్చేసి కాన్వెంట్ విద్యను అందించనున్న నేపథ్యంలో వాటికి సంబంధించి జిల్లాకు తొలి విడతగా 4900 పుస్తకాలు వచ్చాయి. వీటిలో నర్సరీకి సంబంధించి 1400, ఎల్కేజీకి సంబంధించి 2200, యూకేజీకి సంబంధించి 1300 పుస్తకాలు ఉన్నాయి. అర్బన్ ప్రాంతాల వారీగా ప్రీ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి, వాటిలో ఎంతమంది చిన్నారులు చేరే అవకాశం ఉందన్న అంచనాతో తొలి విడతగా జిల్లాకు 4900 పుస్తకాలు వచ్చాయి. అయితే ప్రీ స్కూల్స్లో చేరే పిల్లల సంఖ్య పెరిగే కొద్దీ అదనంగా మరిన్ని పుస్తకాల కోసం మహిళా శిశు సంక్షేమశాఖ ఉన్నతాధికారులకు ఇండెంట్ పెట్టేందుకు కూడా అధికారులు చర్యలు చేపట్టారు. -
ఆప్టెక్ బిగ్ ర్యాలీ
ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ప్రొవైడర్ ఆప్టెక్ ప్రీ స్కూల్ రంగంలో అడుగుపెడుతున్నామన్న ప్రకటన కంపెనీకి మరింత బూష్ట్ ఇచ్చింది. ఈ కొత్త వెంచర్ కోసం అంతర్జాతీయ మోంటానా ప్రీస్కూల్ తో భారీ ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపింది. ట్రేడ్ పండితుడు రాకేష్ ఝున్ ఝన్ వాలా ఇటీవల భారీ వాటా కొనుగోలుతో జోరుగా ఉన్న ఆప్టెక్ మార్కెట్ బలహీనంగా ఉన్నప్పటికీ, ఈ పొత్తు వార్తల నేపథ్యంలో మార్కెట్ లో ఆప్ టెక్ షేరు దూసుకు పోయింది. ఈ డీల్ ప్రకారం ఆప్టెక్ రాబోయే రెండు సంవత్సరాలలో భారతదేశం లో 1,000 ప్రీస్కూల్స్ ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నట్టు ప్రకటించింది. ఎడ్యుకేషన్ రంగంలో వేగమైన అభివృద్ధి ఉందని ఆప్టెక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనుజ్ కేకర్ చెప్పారు. ప్రస్తుతం భారతదేశంలో ప్రీస్కూల్ విద్య మార్కెట్ రూ16,000 కోట్లుగా ఉందని తెలిపారు. దీంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లతో ఐటీ శిక్షణా దిగ్గజం ఆప్టెక్ షేరు 10 శాతం లాభపడింది. 52 వారాల గరిష్టంతో అప్పర్ సర్క్యూట్ను తాకింది. ఆప్టెక్ 10,000 కిపైగా బ్యాంకింగ్ మరియు ఆర్థిక నిపుణులకు శిక్షణ ఇచ్చేందుకు జీయోజిత్ బీఎన్సీ పరిబాస్ తో కుదిరిన ఒప్పందాన్ని జూలై లో ప్రకటించింది. దీంతోపాటుగా ఎన్ఎస్ఇ డేటా ప్రకారం ఆగస్ట్లో ఆప్టెక్ లో ప్రధాన ప్రమోటర్లగా ఉన్న ఇన్వెస్టర్ రాకేష్ ఝున్ఝున్వాలా కుటుంబం మరింత వాటాను కొనుగోలు చేశారు సంగతి తెలిసిందే. దీంతో ఆప్టెక్ షేర్లు గత మూడు నెలల్లో శాతం 150 శాతం లాభపడిందని నిపుణులు తెలిపారు. కాగా గత జూన్ త్రైమాసికంలో ఆప్టెక్ లిమిటెడ్ రూ 0.46 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇది రూ.2.84 కోట్లు. అయితే ఆదాయంలో మాత్రం వృద్ధిని సాధించి రూ 58 కోట్లుగా నమోదుచేసింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో 50 కోట్లుగా ఉంది. -
ఐసీడీఎస్ అస్తవ్యస్తం
పనిచేయని ప్రీస్కూల్ మంత్రం ఐదులోపు పిల్లలున్న కేంద్రాలు 300పైనే నిద్రమత్తులో ఐసీడీఎస్ భీమదేవరపల్లి: అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ అస్యవ్యస్తంగా మారింది. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడం..కిందిస్థాయి సిబ్బంది మామూళ్లకు అలవాటుపడడంతో వ్యవస్థ బలహీనపడింది. జిల్లాలో కొన్ని కేంద్రాలు మాత్రమే పిల్లలు, గర్భిణులు, బాలింతలతో సక్రమంగా తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నా చాలా కేంద్రాలు అధ్వానంగా ఉన్నాయి. జిల్లాలో 16 ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో సుమారుగా 300లకు పైగా కేంద్రాల్లో ఐదులోపు మాత్రమే పిల్లలు ఉన్నారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాల్సిన సీడీపీవోలు, సూపర్వైజర్లు టూర్ల పేరిట సొంతపనులు చేసుకుంటున్నారు. ఇదే అదనుగా తీసుకుని అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ఇష్టానుసారంగా కేంద్రాలను నిర్వహిస్తున్నారు. భీమదేవరపల్లి మండలం రాంనగర్ అంగన్వాడీ కేంద్రంలో ఐదుగురు పిల్లలున్నట్లు రిజిస్టర్లో నమోదు ఉన్నప్పటికీ ఒకే ఒక్క చిన్నారి ఉంది. జిల్లాలో చాలా కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. 16 ప్రాజెక్ట్లు కరీంనగర్ అర్బన్, కరీంనగర్రూరల్, సుల్తానాబాద్, పెద్దపల్లి, రామగుండం, మంథని, మహదేవపూర్, హుజూరాబాద్, భీమదేవరపల్లి, హుస్నాబాద్, వేములవాడ, సిరిసిల్ల, గంగాధర, మల్యాల, జగిత్యాల, మెట్పల్లి మొత్తం 16 ప్రాజెక్ట్లున్నాయి. 3వేలకుపైగా అంగన్వాడీ కేంద్రాల్లో 45వేలకు పైగా చిన్నారులు ఉన్నట్లు రికార్డులు తెలుపుతున్నాయి. ఒక్కో అంగన్వాడీ కేంద్రంలో పిల్లల సంఖ్య 15నుంచి 25 వరకు నమోదైనా హాజరుశాతం సగం కూడా ఉండడం లేదు. పనిచేయని ప్రీస్కూల్ ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా అంగన్వాడీలను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెట్టినా సత్ఫలితం లేదు. గతంలో ఆరేళ్ల వరకు అంగన్వాడీ కేంద్రాల్లో విద్యనభ్యసించే పిల్లలు నేడు నాలుగేళ్లకే ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తున్నారు. దీనికి తోడు ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడంతో దాదాపు మూడేళ్లు నిండిన వారు సైతం అక్కడికే వెళ్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు ఆటపాటలతో విద్య భోదించాలనే నియమాలున్నప్పటికి ఆటవస్తువులు కనిపించడం లేదు. అంగన్వాడీ కేంద్రాల్లో బాలింతలు, గర్భిణులకు అందించే పౌష్టికాహారం విషయంలోనూ అధికారుల పర్యవేక్షణ కరువైంది. నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించలేకపోతుండడంతో కేంద్రాల్లో భోజనం చేసేందుకు బాలింతలు, గర్భిణులు సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఇరువై కేంద్రాల్లో ఐదు లోపే.. – మార్పాటి సులోచన భీమదేవరపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో 217 కేంద్రాలున్నాయి. ఇందులో ఐదు లోపు పిల్లలున్న కేంద్రాలు 20కి పైగా ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడంతో చాలా మంది అంగన్వాడీ పిల్లలు పాఠశాలకు వెళ్తున్నారు.