
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ నేతలపై ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఒక ఆడ బిడ్డగా నాపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ సమాజం మొత్తం రియాక్ట్ అయ్యారు కానీ, బీఆర్ఎస్ పార్టీ, నేతలు స్పందించకపోవడం దారుణమన్నారు. అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నా అంటూ విమర్శలు చేశారు. ఇదే సమయంలో బీఆర్ఎస్తో సంబంధం లేని వ్యక్తితో తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. లిల్లీపుట్ నాయకుడు తనను విమర్శించమేంటని కవిత ప్రశ్నించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో 72 గంటల నిరాహార దీక్షకు ప్రభుత్వానికి, పోలీసులను అనుమతి కోరాం. ప్రభుత్వం అనుమతి విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. నిరాహార దీక్ష అనుమతి కోసం కోర్టుకు వెళ్ళాము.. కోర్ట్ మాకు అనుమతి ఇస్తుంది అనే నమ్మకం ఉంది. గాంధేయ మార్గంలో దీక్ష చేస్తాం. సానుకూల దృక్పథంతో ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని కోరుతున్నాం. 42 శాతంలో ముస్లింలు ఉన్నారో లేదో ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు.. ఉన్నారా లేదా స్పష్టత ఇవ్వాలి. ముస్లిం రిజర్వేషన్ల విషయంలో ఏం చేస్తారో ప్రభుత్వం చెప్పాలి. దొంగనే దొంగ అన్నట్టుగా ఉంది బీజేపీ వాళ్ళ ధర్నా..
ఒక ఆడ బిడ్డగా నాపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ సమాజం మొత్తం రియాక్ట్ అయ్యారు కానీ, బీఆర్ఎస్ పార్టీ స్పందించలేదు. లిల్లీపుట్ నాయకుడు నల్గొండ జిల్లాలో పార్టీని నాశనం చేశాడు. కన్ను లొట్టపోయి గెలిచిన నాయకుడు.. ఎన్నడు ప్రజా పోరాటాల్లో పాల్గొన లేదు. అసలు బీఆర్ఎస్తో మీకేం సంబంధం?. లిల్లీపుట్ నాయకుడు, నిన్న మొన్న వచ్చిన చోటా మోటా నాయకులు కూడా నాపై మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్కు సంబంధం లేని వ్యక్తితో నాపై ఆరోపణలు చేయిస్తున్నారు. వారి వెనక బీఆర్ఎస్లో పెద్ద నాయకుడు ఉన్నారు. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు అన్ని బయటపెడతాను. పార్టీ కూడా సమయం వచ్చినప్పుడు స్పందిస్తుంది. దీక్షకు అనుమతి రాకపోతే ఇంట్లోనే దీక్ష చేస్తా అంటూ వ్యాఖ్యలు చేశారు.
