మీడియా సమావేశంలో మాట్లాడుతున్న డీజీపీ శివధర్రెడ్డి. చిత్రంలో డీజీ మహేశ్ భగవత్
ఆ కేసులో సాంకేతిక ఆధారాలను 2021లోనే కోర్టుకు సమర్పించాం
ల్యాబ్లో అగ్నిప్రమాదంపై నిపుణులతో దర్యాప్తు కొనసాగిస్తున్నాం
మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ బందోబస్తు ఏర్పాట్లు చేశాం
ఇప్పటివరకు రూ. 3.09 కోట్ల ‘మున్సిపల్’ నగదు స్వాధీనం చేసుకున్నాం
మీడియా సమావేశంలో డీజీపీ బి.శివధర్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఏ వస్తువులూ అగ్నిప్రమాదం జరిగిన రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్)లో లేవని డీజీపీ బి. శివధర్రెడ్డి స్పష్టం చేశారు. ఈ కేసులో పూర్తి సాంకేతిక ఆధారాలను 2021లోనే కోర్టుకు సమర్పించామని చెప్పారు. కేసులో చార్జిషీట్ దాఖలు సైతం పూర్తయిందన్నారు. కొందరు తెలిసీ తెలియక కొన్ని వ్యాఖ్యలు చేశారని.. ఈ విషయంలో ఎలాంటి అను మా నాలకు తావులేదన్నారు.
మున్సిపల్ ఎన్నికల బందోబస్తు ఏర్పాట్లపై మంగళవారం మీడియా సమావేశంలో శాంతిభద్రతల అదనపు డీజీ మహేశ్ భగవత్తో కలిపి డీజీపీ బి.శివధర్రెడ్డి మాట్లాడారు. ఎఫ్ఎస్ఎల్లో అగ్నిప్రమా దానికి కారణాలపై సెంట్రల్ ఫోరెన్సిక్ నిపుణులు, నాగ్పూర్ లోని ఫైర్ సర్వీసెస్ నిపుణులతో కలిసి పరిశీలిస్తున్నామని చెప్పారు. పరిశీలన పూర్తయ్యాక వివరాలు వెల్లడిస్తామ న్నారు. దగ్ధమైన ఎఫ్ఎస్ఎల్ సర్వర్లలోని డేటాను రిట్రీవ్ చేసేందుకు ఎఫ్ఎస్ఎల్ సాంకేతిక నిపుణులతోపాటు బయ టి నిపుణుల సహాయం కూడా తీసుకుంటున్నట్లు డీజీపీ తెలిపారు.
ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన అన్ని నివేదికలు ఎఫ్ఎస్ఎల్ నుంచి సంబంధిత అధికారులకు ఇప్పటికే పంపించామని చెప్పారు. మక్తల్లో బీజేపీ అభ్యర్థి ఎరుకలి మహదేవ్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం ఉందని.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు.
ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి..
రాష్ట్రంలోని ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపా లిటీలకు బుధవారం జరగనున్న పోలింగ్ నిర్వహణకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశామని డీజీపీ శివధర్రెడ్డి వెల్లడించారు. ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 8,203 పోలింగ్ కేంద్రాల్లో పకడ్బందీ భద్రత కల్పించామన్నారు. 1,302 కేంద్రాలను అత్యంత సమస్యాత్మక మైనవిగా, 1,926 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించి అదనపు బలగాలను మోహరించినట్లు తెలిపారు.
పార దర్శకత కోసం అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ 100 శాతం వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామని చెప్పారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రతి పోలింగ్ కేంద్రం వెలుపల కూడా నిఘా కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం సుమారు 3 వేల మంది అదనపు బలగాలను రంగంలోకి దించామని డీజీపీ వివరించారు.
నిరంతరం నిఘా..
ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన గత నెల 27 నుంచి ఇప్పటివరకు మొత్తం రూ. 3.09 కోట్ల విలువైన నగదు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న వాటిలో రూ. 1.29 కోట్ల నగదు, రూ. 1.21 కోట్ల విలువైన మద్యం, రూ. 15.7 లక్షల విలువైన మాదకద్రవ్యాలు, రూ. 28.69 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు ఉన్నాయని తెలిపారు.
అక్రమ రవాణాను అరికట్టేందుకు పొరుగు రాష్ట్రాల సరిహద్దుల్లో 20 చెక్ పోస్టులను, జిల్లాల సరిహద్దుల్లో 55 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి నిరంతరం నిఘా ఉంచుతున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,183 లైసెన్స్డ్ ఆయుధాలను పోలీసు స్టేషన్లలో డిపాజిట్ చేయించామని.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న 4,318 మందిని బైండోవర్ చేసినట్లు వివరించారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి ఇప్పటివరకు 142 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు డీజీపీ శివధర్రెడ్డి తెలిపారు.


