
గుంటూరు, సాక్షి: ఎన్నికలకు ముందు ఉద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు ఇప్పటికీ ఒక్కటి కూడా అమలు చేయలేదని.. ఇప్పుడు బదిలీల పేరుతో వేధిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎంప్లాయిస్ అండ్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ చంద్రశేఖర్రెడ్డి(N Chandrashekar Reddy) అన్నారు. ఏపీలో ఉద్యోగుల బదిలీల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయంటూ శనివారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మీడియాతో మాట్లాడారు.
‘‘ఉద్యోగుల బదిలీల్లో భారీగా అక్రమాలు నడుస్తున్నాయి. ఎమ్మెల్యేల(Kutami MLAs) నుండి సిఫార్సు లేఖలు తెమ్మని కొందరు అధికారులు చెప్తున్నారు. ఆ సిఫార్సు లేఖలు కావాలంటే అదే విషయాన్ని కూడా జీవోలో ప్రస్తావించాల్సి ఉంది. అయినా.. ఉద్యోగుల బదిలీలకు ఎమ్మెల్యేల సిఫార్సులతో పనేంటి?..
.. కొంతమంది టీడీపీ నేతలు ముఠాగా ఏర్పడి బదిలీల వ్యవహారం నడిపిస్తున్నారు. లక్షలకు లక్షలు లంచాలు వసూలు చేస్తున్నారు. లంచాలు పూర్తిగా అందలేదని బదిలీల సమయాన్ని కూడా పెంచటం అన్యాయం. రాజకీయ బదిలీలు కరెక్టు కాదు. లంచాలు లేకుండా పారదర్శకంగా బదిలీలు చేయాలి. అలా జరిగినప్పుడే ఉద్యోగులు సరిగా పని చేయగలుగుతారు.
రెవెన్యూ శాఖలో కొన్ని పోస్టులకు వేలం వేయటం దుర్మార్గమైన చర్య. అనంతపురంలో సచివాలయ ఉద్యోగిపై టీడీపీ నేత అశ్వథ్రెడ్డి దూషణలకు దిగారు. ఉద్యోగులను తిడితే ప్రభుత్వాన్ని తిట్టినట్టే. టీడీపీ నేత అశ్వథ్రెడ్డి(Ashwath Reddy)పై కఠిన చర్యలు తీసుకోవాలి అని చంద్రశేఖర్ ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: బాబు మారకపోతే.. భవిష్యత్తు ఘోరంగా ఉంటుంది